పాక్ బరితెగింపు: కాల్పుల్లో ముగ్గురు భారత సైనికుల మృతి, ఐదుగురికి గాయాలు
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. గురువారం జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.
వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పాక్ కాల్పులలకు తెగబడటంతో భారత సైన్యం కూడా ధీటుగా బదులిచ్చింది. అయితే, పాక్ వైపు జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు.
కుప్వారా జిల్లాలోని నౌగాం సెక్టార్లో భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, నలుగురికి గాయాలయ్యాయి. ఇక, పూంఛ్ సెక్టార్లో చోటు చేసుకున్న మరో ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. మోర్టారు షెల్లింగ్ దాడులకు కూడా పాక్ పాల్పడుతోందని భారత సైన్యం తెలిపింది.
గత ఎనిమిది నెలల్లో పాకిస్థాన్ 3వేల సార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 2003లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు చేసుకున్నాయి. అయినా, పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తరచూ తూట్లు పొడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు వేలసార్లు కాల్పులకు తెగబడటం గమనార్హం. ఒక సెప్టెంబర్ నెలలోనే 47 సార్లు, గత ఎనిమిది నెలల్లోనే 3వేలసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.