మహారాష్ట్ర.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల : హుజూర్ నగర్ కూ ఉప ఎన్నిక..!!
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అదే విధంగా తెలంగాణలో పీసీపీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు సైతం షెడ్యూల్ ఖరారు చేసింది. వీటితో పాటుగా దేశ వ్యాప్తంగా మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు 18 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలను ఒక విడతలో నిర్వహించనున్నారు.
అదే విధంగా ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ప్లాస్టిక్ కు అవకాశం లేకుండా నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికలు ప్రకటించిన ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 21న ఎన్నికలు..అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
రెండు రాష్ట్రాల్లో ఒకే సారిగా..
కేంద్రంలో తిరిగి అధికారం దక్కించుకున్న మోదీకి ఇప్పుడు తొలి సారి ఎన్నికలు పరీక్షగా మారుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోడా ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా తెలంగాణ లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక సైతం జరగనుంది. ఈ ఎన్నికలకు ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు అక్టోబర్ 4 చివరి తేది కాగా, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 5న జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్, 24న ఫలితాలు విడుదలకానున్నాయని ఈసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈసీ కఠిన నిబంధనలు విధించింది. ఎన్నికల్లో ప్లాస్టిక్పై నిషేధం విధించింది. అభ్యర్థులు తమ ప్రచారంలో ప్లాస్టిక్ ఉపయోగించకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితిని గరిష్టంగా రూ.28 లక్షలుగా నిర్ణయించారు. మహారాష్ట్రలో వ్యయ పర్యవేక్షకులుగా ఇద్దరిని నియమిస్తున్నట్టు ప్రకటించింది. నామినేషన్ పత్రంలో ఒక్క కాలమ్ వదిలినా నామినేషన్ రద్దవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
హర్యానాలో 90 స్థానాలు..మహారాష్ట్రలో 288 స్థానాలకు
వచ్చే నెల 21 పోలింగ్ జరిగే మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదే విధంగా హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుననాయి. నవంబర్ 2వ తేదీతో హర్యానా అసెంబ్లీకి.. నవంబర్ 9వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమతి ముగియనుంది. కాగా..మహారాష్ట్రలో 8.94 కోట్లు, హర్యానాలో 1.82కోట్లు ఓటర్లు ఉన్నారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పాటుగా ఈ రెండు చోట్లా తమ అధిపత్యం నిలబెట్టుకొనేందుకు బీజేపీ కొద్ది కాలం నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో బీజేపీ.. శివసేన కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా హర్యానా లోనూ పట్టు నిలుపుకొనే ప్రయత్నం చేస్తోంది.
హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ విడుదల అయింది. ఇప్పటికే ఈ సీటును దక్కించుకొనేందుకు తెలంగాణ అధికార పార్టీ పావులు కదుపుతోంది. అదే విధంగా ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సీటు మీద రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర నేతల మధ్య మాటల యుద్దం సైతం సాగింది. దీంతో..ఇప్పుడు ఇక ఈ సీటు కోసం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయంగా యుద్దం సాగే అవకాశం కనిపిస్తోంది.