లైంగిక దాడి కేసుల్లో రెండు వేళ్ల పద్ధతి ఉందా, లేదా: మాడభూషి శ్రీధరాచార్యులు
హైదరాబాద్: లైంగికదాడి నిర్ధారణ కోసం వివాదాస్పద రెండువేళ్ల పరీక్షా విధానానికి ఇంకా స్వస్తిపలికింది లేనిది స్వయంగా వెల్లడించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారో లేదో తెలుపాల్సిందిగా ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఢిల్లీ ఆరోగ్యశాఖ సమాధానం తెలుపలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి సీఐసీని ఆశ్రయించిన నేపథ్యంలో సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఈ ఆదేశాలను వెలువరించారు.
రెండు వేళ్ల విధానంలో పరీక్షించడం బాధితురాలి హక్కులకు భంగం కల్గించడమేనని, దాని స్థానంలో లైంగికదాడి నిర్థారణకు మెరుగైన విధానాలు రూపొందించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉటంకించిన శ్రీధరాచార్యులు, వైద్యులు చేయబోయే పరీక్షలు ఎలాంటివో తెల్సుకునే హక్కు బాధితులకు తప్పక ఉంటుందని, ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని విధిగా స్పష్టం చేయాల్సిందేనన్నారు.
భార్యాభర్తల మధ్యనా ఆర్టిఐ
భార్యాభర్తల మధ్య ఆదాయం, పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించి సమాచార ఆదానప్రదాన హక్కు (ఆర్టీఐ) ఉంటుందని కేంద్ర సమాచార కమిషనర్ మాఢభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. భర్త వదిలేసిన ప్రశాస్న శర్మ అనే మహిళ దాఖలు చేసిన రెండో అప్పీలు విచారణ సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు. భార్యాపిల్లల పోషణ విషయాల్లో ఆర్టీఐ కల్పిస్తున్న గోప్యతను ప్రజాహితం అధిగమిస్తుందన్న ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఆధారంగా ఈ కేసును పరిష్కరించారు.
కాగా, ఉద్యోగి అయిన భర్త ఆస్తులు, తానిచ్చిన కట్నం తాలూకు వివరాలు మొత్తం కావాలని ప్రశాస్న శర్మ అభ్యర్థన దాఖలు చేశారు. అయితే, ఇది కోర్టు పరిధిలోకి వచ్చే అంశమంటూ సమాచార అధికారి చేతులు దులిపేసుకున్నారు. దీన్ని శ్రీధర్ ఆచార్యులు తప్పుబట్టారు. భార్యాభర్తల మధ్య సమాచార దాపరికానికి చోటులేదని, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.