అయిదురోజుల్లో మూడు కాల్పుల ఘటనలు: డిప్యూటీ పోలీస్ కమిషనర్పై కొరడా..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తోన్న జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు, ఇతర ఆందోళనకారులపై నమోదవుతోన్న వరుస కాల్పుల ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు కన్నెర్ర చేశారు. కాల్పుల ఉదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను నియంత్రించలేకపోయారనే కారణంతో.. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్పై బదిలీ వేటు వేశారు.
కాల్పుల కలకలం: అర్ధరాత్రి స్కూటీపై వచ్చి.. యూనివర్శిటీ గేట్ వద్ద..!
బదిలీ వేటు వేసిన కొన్ని గంటల్లోనే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఓ ఉన్నత స్థాయి పోలీస్ కమిషనర్ బదిలీ కావడం ఇదే తొలిసారి. ఈ రెండు కాల్పుల ఉదంతాలు కూడా చిన్మయ్ బిశ్వాల్ పర్యవేక్షిస్తోన్న ప్రాంతాల పరిధిలోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనపై బదిలీ వేటు వేయడానికి కారణమయ్యాయి. చిన్మయ్పై బదిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి జామియా విద్యార్థులపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులు ఎక్కు పెట్టారు. వారిని బెదిరిస్తూ.. గాల్లోకి కాల్పులు జరిపారు.
డీసీపీ బదిలీకి కారణమైన కాల్పులు..
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో భారీ ప్రదర్శన నిర్వహించిన జామియా మిల్లియా యూనివర్శిటీ విద్యార్థులపై రామ్భక్త్ గోపాల్ శర్మ అనే 17 సంవత్సరాల యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఆ ఘటన చోటు చేసుకున్న రెండురోజుల వ్యవధిలో షహీన్ బాగ్ వద్ద కపిల్ గుర్జర్ అనే యువకుడు మూడు రౌండ్ల పాటు గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ రెండు ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని చిన్మయ్ బిశ్వాల్పై బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం.
ఈసీ కన్నెర్ర..
చిన్మయ్ బిశ్వాల్ స్థానంలో కుమార్ జ్ఙానేశ్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఆదేశించింది. చిన్మయ్ బిశ్వాల్కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలండ్ పోలీస్ సర్వీస్కు చెందిన కుమార్ జ్ఙానేశ్ ప్రస్తుతం ఆగ్నేయ ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్గా పని చేస్తున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది ఎన్నికల కార్యాలయం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ప్రకంపనలను పుట్టిస్తున్నాయి.