ఈ దీపావళి జరుపుకోండి అందరితో కలిసి సందడిగా: ఎకో ఫ్రెండ్లీ గా ఎలాగంటే
దీపావళి.. అందరి ఇళ్ళలో, జీవితాలలో దీప కాంతులు నింపే పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే వేడుక. చీకటి నుండి వెలుగు వైపు పయనం సాగించాలనే భావనకు సూచిక. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడవాలనే సందేశాన్నిచ్చే పండుగ దీపావళి. అంతేకాదు బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతూ, ఒక కృతజ్ఞతకు గుర్తుగా, ఆనందానికి ప్రతీకగా జరుపుకునే వేడుక ఇది. భారత దేశంలోని అందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపేలా చేసుకోవాలి.
ఎకో ఫ్రెండ్లీ దీపావళి మనుషులు ఎవరికి,ప్రకృతికి ఎలాంటి హాని లేకుండా జరుపుకోవాలని వన్ ఇండియా కోరుకుంటుంది. అందుకే దీపావళి వేడుకలు ఎలా జరుపుకోవాలో, ఎలా జరిగితే అందరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోగలుగుతారో తెలుసుకుందాం. దీపావళి పండుగను బంధు మిత్రులతో సందడిగా జరుపుకోండి. ప్రతి నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో,విధి నిర్వహణ నేపధ్యంలో ఎప్పుడూ బిజీగా గడిపే వారంతా దీపావళి పండుగ సందర్భంగా అందరూ ఒక చోటు కలిసే ఏర్పాటు చేసుకోండి.
సంగీతం,నృత్యం, ఆటలు,పాటలు వంటి అనేక కార్యక్రమాలతో ఆ రోజును సంతోషంగా గడపండి. ఎందుకంటె సామాజిక వేడుకలు వ్యక్తిగత వేడుకల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. కనుక అందరూ కలిసి పండుగ చేసుకునే ప్లాన్ ఇప్పటి నుండే చేసుకోండి. ఇక అందరూ తలా ఒక రకమైన వంటకం తయారు చేసి తీసుకెళ్ళి,అందరూ అందరి వంటలు షేర్ చేసుకుంటూ అంతా కలిసి భుజించండి.ఇక నగర వాసులు గేటెడ్ కమ్యూనిటీలలో దీపావళి సెలబ్రేషన్స్ అంతా కలిసి చేసుకోండి.
బాణాసంచా కాల్చటానికి బదులు అందరూ ఆటపాటలతో సరదా ముచ్చట్లతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి వేడుక చేసుకోండి. ఒకరికొకరు మిఠాయిలు పంచుకోండి. ఈ దీపావళిని ఉమ్మడిగా,సంతోషంగా అంతా కలిసి జరుపుకోండి.అప్పుడే సంతోషాల పండుగ పరమార్ధం అర్ధం అవుతుంది. సామూహికంగా అంతా కలిసి సంతోషంగా గడపాలనేదే పండుగల ముఖ్య ఉద్దేశం . మరెందుకాలస్యం బంధుమిత్రులతో ఈ దీపావళి జరుపుకోండి.