స్వాతంత్ర్య భారతంలో తొలిసారి: 2021లో ఓబీసీ గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి చర్య ఏ ప్రభుత్వమూ తీసుకోకపోవడం గమనార్హం. కేంద్రం హోం శాఖ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కీలక సమావేశంలో ఓబీసీ డేటా సేకరించాలని నిర్ణయించారు.
ఇక నుంచి మూడేళ్లకోసారి
ఇక నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏడెనిమిది సంవత్సరాల ఒకసారి సెన్సస్ డేటా సమీకరిస్తున్నారు. టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చినందున... సెన్సస్ ను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తీయాలని నిర్ణయించింది. దీని ప్రకారం 2021లో కొత్త సెన్సస్ డేటా సేకరణ ప్రారంభమౌతుందని తెలుస్తోంది.
25లక్షలమంది లెక్కింపు సిబ్బంది..
2021లో చేపట్టనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆఫీసర్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ పాల్గొన్నారు. ఈసారి సెన్సస్ డేటా సేకరణ కోసం 25 లక్షల మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జన గణన పూర్తయిన మూడేళ్లకే తుది నివేదిక వచ్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.
టెక్నాలజీ వాడకం
ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే శిశు, ప్రసూతి మరణాల రేటు, సంతానోత్పత్తి రేట్లను సరిగ్గా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇళ్ల జాబితాను రూపొందించేందుకు మ్యాపులు, జియో రిఫరెన్సింగ్ వంటి సదుపాయాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
స్వాతంత్ర్యం రాకముందు లెక్కింపు.. తర్వాత ఇప్పుడే
కాగా, జనాభా లెక్కల్లో ఓబీసీ గణాంకాలను చివరిసారిగా 1931లో బ్రిటీష్ వారి పాలనా కాలంలో సేకరించారు. ఆ గణాంకాల ప్రాతిపదికగానే ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లను ప్రకటించింది. గణాంకాల శాఖ అనుబంధ సంస్థ అయిన జాతీయ నమూనా సర్వే సంస్థ 2006లో చేపట్టిన నమూనా సర్వేలో దేశంలో ఓబీసీలు 41 శాతం ఉన్నట్లు తెలిపింది. కాగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు నిర్వహించనున్న ఓబీసీ జన గణనే తొలిసారి కావడం గమనార్హం.