సినిమా థియేటర్లపై కేంద్రం నిర్ణయంతో షాక్ లో సినీ పరిశ్రమ .. జూన్ తర్వాత కూడా డౌటే !!
కరోనా వైరస్ అటు ప్రపంచాన్ని, ఇటు ఇండియాను వణికిస్తున్న మహమ్మారి . ఈ మహమ్మారి దెబ్బకు థియేటర్లు , మల్టీ పెక్స్ లు మూత పడ్డాయి. భారతదేశ చలన చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా దెబ్బ తిన్న పరిస్థితుల్లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను సినీ పరిశ్రమ వర్గాలు థియేటర్లను తెరవటం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి.ఇక ఇప్పటికే ఘోరంగా కుదేలైన సినీ పరిశ్రమ ఆర్థికంగా కోలుకోవడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని చలనచిత్ర పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సమయంలో సినీ వర్గాలు చేసిన ప్రయత్నం సఫలం కాలేదు.
అన్నిటికీ మినహాయింపులు ఇస్తున్నా థియేటర్లకు మాత్రం నో అన్న కేంద్రం
కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ లాక్ డౌన్ నుండి కొన్ని మినహాయింపులు ఇస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం . ఈ క్రమంలో సినిమా థియేటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడంతో పాటు ,ఈ నెలాకరు వరకు సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ముందు ముందు కరోనా కేసులు తగ్గు ముఖం పడితే ఆలోచిస్తామని పేర్కొంది. అయితే కరోనా కేసులు ఇండియాలో 2 లక్షలకు పైగా పెరగటంతో ముందు ముందు కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందు ముందు కూడా థియేటర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అన్న నమ్మకం కలగటం లేదు .
సినీ పరిశ్రమ విజ్ఞప్తి చేసినా సరే కనిపించని సానుకూలత .. జూన్ తర్వాత ఆలోచిద్దాం అన్న మంత్రి జవదేకర్
సినీ ఇండస్ట్రీ కరోనాతో తీవ్రంగా కుదేలైందని, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అయితే దీనిపై కేంద్ర మంత్రి జవదేకర్ ఆయా సంఘాల ప్రతినిధులతో వీడియో సమావేశం ద్వారా చర్చించారు. కానీ ఆయన సానుకూలత వ్యక్తం చెయ్యలేదు. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్ తర్వాతే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. జూన్ నెలకు సంబంధించి కరోనా వైరస్ కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన తర్వాత సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.
కరోనా పెరుగుతున్న నేపధ్యంలో మరోమూడు నెలలు మూసివేత అనుమానం
కేంద్రం చెప్తున్న దానిని బట్టి దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడితేనే థియేటర్ల విషయంలో ఆలోచిస్తారు. ఇక ఉధృతి తగ్గకపోతే జూన్ తర్వాత మరికొన్ని నెలలపాటు సినిమా థియేటర్లను మూసివేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో మూడు నెలల పాటు ఆగాల్సి వస్తుందేమో అన్న అనుమానాలు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. షూటింగ్లకు అవకాశాలు ఇచ్చి థియేటర్లకు మాత్రం మరి కొన్ని రోజులు లాక్డౌన్ పొడిగించే ఛాన్స్ ఉన్న పరిస్థితి థియేటర్ల యాజమాన్యాలను కుదేలు చేస్తుంది.
కేంద్రం తాజా నిర్ణయంతో షాక్ లో సినీ పరిశ్రమ వర్గాలు
ఇప్పటికే దేశ వ్యాప్తంగా సుమారు 9,600 థియేటర్లు మూసివేయబడ్డాయి మరియు మల్టీప్లెక్స్లు మరియు సింగిల్-స్క్రీన్ సినిమాహాళ్ళలో వ్యాపారం పూర్తిగా దెబ్బ తింది. కరోనా లాక్ డౌన్ తో థియేటర్లు మూత పడటం థియేటర్ యాజమాన్యాలను దివాలా తీయించే స్థితికి నెట్టింది .ఇక కేంద్రం థియేటర్ల విషయంలో సానుకూలత వ్యక్తం చెయ్యని వైఖరి అటు సినీ పరిశ్రమకు, ఇటు థియేటర్లకు పెద్ద షాక్ అనే చెప్పాలి .