అది రహస్యం.. అందుకే బ్లాక్మనీ వివరాలు ఇవ్వలేం
స్విట్జర్లాండ్లో భారతీయులు దాచుకున్న నల్లధనానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అది రహస్య సమాచారమైనందున వాటిని బహిర్గతం చేయడం సాధ్యం కాదని చెప్పింది. ఆ కారణంగానే స్విట్జర్లాండ్ నుంచి అందిన వివరాలను ఎవరితో పంచుకోలేమని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటీషన్కు సమాధానమిచ్చింది. ఇది నిరంతర ప్రక్రియ అని అందుకే ప్రతి కేసు వివరాలు ఇవ్వలేమని స్పష్టంచేసింది.
స్విట్జర్లాండ్తో కుదిరిన ఒప్పందం మేరకు ఇప్పటి వరకు నల్లధనానికి సంబంధించి ఆ దేశం అందించిన కేసుల వివరాలు ఇవ్వాలంటూ పీటీఐ జర్నలిస్టు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వ్యక్తులు, సంస్థల వివరాలతో పాటు వారిపై తీసుకున్న చర్యల గురించి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే అది రహస్య సమాచారమైనందున వాటిని ఎవరితో పంచుకోలేమని ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది.
ట్యాక్స్ ఎగవేతదారుల సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్, స్విట్జర్లాండ్ మధ్య 2016 నవంబర్ 22న ఒప్పందం కుదిరింది. ఈ డీల్ మేరకు ఇరు దేశాలు ఫైనాన్షియల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకునే అవకాశం లభించింది. 2018 క్యాలెండర్ ఇయర్ నుంచి ట్యాక్సులకు సంబంధించి స్విట్జర్లాండ్ - భారత్లు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. స్విస్ బ్యాంకుల్లో దాచిన లెక్కచూపని ఆదాయంతో పాటు అక్కడ ఉన్న ఆస్తులకు సంబంధించి స్విట్జర్లాండ్ ఇచ్చే సమాచారం ఆధారంగా భారత్ పన్నులు, ఫైన్లు విధించనుంది.