కర్ణాటకకు రూ. వెయ్యి కోట్లు, ఒడిశాకు రూ. 3,338 కోట్లు, అమిత్ షా, నిర్మలా సీతారామన్ !
న్యూఢిల్లీ: కర్ణాటకలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది. వరద భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు రూ. 1,029 కోట్లు కేటాయించింది. ఒడిశాకు రూ. 3, 338 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తెలిపారు.
నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా ఇటీవల కురిసన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తిన విషయం చర్చకు వచ్చింది. ఇటీవల కర్ణాటకలోని వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పర్యటించి ఎంత నష్టం జరిగింది అని ఆరా తీసి నివేదిక తయారు చేశారు.
రూ. 4, 432 కోట్ల పరిహారం
భారీ వరదల కారణంగా ఏ రాష్ట్రంలో ఎంత నష్టం జరిగింది అని ఈ సమావేశంలో చర్చించారు. కర్ణాటక, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రూ. 4, 432.10 కోట్ల పరిహారం ప్రకటించామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. అధికారులతో సమావేశం అనంతరం కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.
ఒడిశాకు రూ. 3, 338 కోట్లు
ఒడిశాకు రూ. 3, 338. 22 కోట్లు, కర్ణాటకకు రూ. 1,029.39 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కూ. 64.49 కోట్లు పరిహారం అందిస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మీడియాకు చెప్పారు. కర్ణాటకలో ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు కురిసి వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇప్పటికి ఆ ప్రాంత ప్రజలు పరిహారం కోసం వేయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.
22 జిల్లాలకు వరదల దెబ్బ
దక్షిణ కన్నడ, ఉత్తర కర్ణాటక, బెళగావి, బాగల్ కోటే జిల్లాలతో పాటు 22 జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలకు 103 తాలుకాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. 7.5 లక్షల హెక్టార్ల పంట నాశనం అయ్యిందని అధికారులు గుర్తించారు.
రూ. 10 వేల కోట్ల నష్టం
భారీ వర్షాలు వరదల కారణంగా సుమారు రూ. 10 వేల కోట్ల నష్టం జరిగిందని, వెంటనే రూ. 3 వేల కోట్ల పరిహారం ప్రకటించాలని కర్ణాటక ముఖ్యంత్రి బీఎస్. యడియూరప్ప కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. ఈ విషయంపై రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యి నష్ట పరిహారం ప్రకటించాలని మనవి చేశారు.