ఇక చైనా ఖేల్ ఖతం.. త్రివిధ దళాలకు సంచలన ఆదేశాలు.. డ్రాగన్ తోకజాడిస్తే కత్తిరించాలంటూ..
రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించిన చైనా సైనికులు.. మన 20 మంది జవాన్లను కిరాతకంగా హతమార్చిన తర్వాత భారత శిబిరాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబిగాయి. తోటి సైనికుల మరణాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్లను తలుచుకుంటున్న తరుణాన సరిహద్దు వెంబడి క్యాంపుల్లో గంభీర వాతావరణం నెలకొంది. ఓవైపు డ్రాగన్ బలగాలు రాక్షసంగా ప్రవర్తిస్తుంటే.. మనవాళ్లకు కనీసం ఆయుధాలైనా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానంగా.. ఇకపై చైనాతో వ్యవహారానికి సంబంధించి త్రివిధ దళాలకు మోదీ సర్కార్ సంచలన ఆదేశాలు వెలువరించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. విచక్షణాధికారాలు ఉపయోగించిన సీఎం కేసీఆర్..
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ..
స్వతహాగా శాంతికాముక దేశమైన భారత్.. సరిహద్దులపై గతంలో చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఇన్నాళ్లూ ఓపిక వహిస్తూ వచ్చింది. గడిచిన ఆరు వారాలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా కవ్వింపులకు దిగుతున్నా భరించింది. కానీ, గత వారం తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో మన సైనికులు 20 మంది హత్యకు గురికావడం, మరో 76 మందికి తీవ్రంగా గాయపడిన తర్వాత చైనాను ఇక ఏమాత్రమూ ఉపేక్షించరాదని భారత్ నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే ఆర్మీతోపాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కు కూడా పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ నేతృత్వంలో ఆదివారం జరిగిన హైలెవల్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.
చైనా దూకుడుకు కళ్లెం..
సైనికుల మరణాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం కావడం, చైనాకు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్న తరుణంలోనే, ‘‘ఆ దేశానికి దీటుగా జవాబిస్తాం..''అని ప్రధాని మోదీ హెచ్చరించడం తెలిసిందే. తూర్పు లదాక్ సహా ఎల్ఏసీ అంతటా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆదివారం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. దీనికి త్రివిధ దళాల అధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా హాజరయ్యారు. ఇకపై చైనా దూకుడుకు కళ్లెం వేసేలా.. వాళ్లు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా మనవాళ్లు కూడా అదే స్థాయిలో దీటుగా స్పందించాలనే ఆదేశాలను రక్షణ మంత్రి జారీ చేసినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
ఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలో
3,500కి.మీలో ఎక్కడైనా..
చైనా కిరాతకానికి అడ్డుకట్టవేసేలా భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ కల్పించిన కేంద్రం.. ఆ ఆదేశాలు ఒక్క తూర్పు లదాక్ కు మాత్రమే పరిమితం కాబోవని, మొత్తం 3,500 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దు అంతటికీ ఇది వర్తిస్తుందని, ఏ ప్రాంతంలోనైనా చైనా తోకజాడిస్తే గనుక దాన్ని కత్తిరించడానికి సంకోచించవద్దని ఆర్మీ చీఫ్ కు రక్షణ మంత్రి చెప్పినట్లుగా కేంద్ర వర్గాలు తెలిపాయి. అలాగే, గగన తలంలో చోటుచేసుకుంటోన్న వ్యవహారాలపైనా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ ఫోర్స్ చీఫ్ కు, హిందూ మహాసముద్రం, పసిఫిక్ సముద్రాల్లోనూ చైనా కదలికలపై గట్టి నిఘా ఉంచాలని నేవీ చీఫ్ కు రక్షణ మంత్రి సూచించినట్లు సమాచారం.
గాల్వాన్పై మొండివాదన..
చరిత్ర పొడవునా వివాద రహితంగా ఉన్న గాల్వాన్ లోయలో గత వారం హత్యాకాండ తర్వాత ఆ ప్రాంతమంతా తనదేనంటూ చైనా ఆర్మీ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడం తెలిసిందే. తాజాగా గ్రాడన్ విదేశాంగ శాఖ సైతం గాల్వాన్ తమదేనని, ఇండియానే అక్రమణకు ప్రయత్నిస్తున్నదంటూ అబద్ధాలు వల్లెవేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ శనివారం వరుస ట్వీట్లు చేశారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ సైతం ఘాటుగా బదులిచ్చారు. చైనాదంతా అతిశయోక్తులు, అవాస్తవాలతో కూడిన డొల్ల వాదన అని మండిపడ్డారు. చైనా సరిహద్దును అతిక్రమించాలని ప్రయత్నిచగా భారత దళాలు ప్రతిఘటించాయని చెప్పారు.
Recommended Video
రేపు రష్యాకు రాజ్నాథ్..
జవాన్ల హత్యల తర్వాత చైనాతో మన సంబంధాలు బాగా బలహీనపడిన వేళ.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ తొలి అంతర్జాతీయ పర్యటనకు వెళ్లనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రష్యా భారీ సైనిక పరేడ్ ను తలపెట్టింది. ఈనెల 24న మాస్కోలో జరగనున్న ఈ వేడుకలో 75 మందితో కూడిన భారత సైనిక బృందం కూడా పాల్గొంటున్నది. చైనా సహా మొత్తం 11 దేశాల సైన్యాలు కూడా కవాతులో పాలుపంచుకోనున్నాయి. దీనికి అతిథిగా రావాలన్న రష్యా ఆహ్వానం మేరకు రాజ్ నాథ్ సోమవారం మాస్కో బయలుదేరి వెళతారు. ఆయన వెంట రక్షణ , విదేశాంగ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు సైతం వెళతారని, ద్వైపాక్షిక అంశాలతోపాటు చైనా వ్యవహార శైలిపైనా రష్యాతో రాజ్ నాథ్ చర్చలు జరుపుతారని కేంద్ర వర్గాలు తెలిపాయి.