దేశం విడిచి వెళ్లండి బంగ్లా నటుడికి కేంద్రం ఆదేశం
ఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఫిర్దోస్ బిజినెస్ వీసాను రద్దు చేసిన ప్రభుత్వం మళ్లీ భారత్లో అడుగుపెట్టకుండా ఆయన పేరును బ్లాక్ లిస్టులో చేర్చింది.
టీఎంసీ తరపున ఆదేశ నటుడు ప్రచారం... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
కోల్కతా ఫారనర్ రీజినల్ రిజిస్ట్రేషన్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రిపోర్టులో ఫిర్దోస్ అహ్మద్ వీసా నింబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో వీసా రద్దుచేసి దేశం విడిచి పోవాలని నోటీసులు జారీ చేసింది.
బంగ్లాదేశ్ ప్రముఖ నటుడు ఫిర్దౌస్ అహ్మద్ బెంగాల్లో తృణమూల్ అభ్యర్థి కన్హయ్యలాల్ అగర్వాల్ తరఫున ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మరో ఇద్దరు నటులు అంకుశ్, పాయల్తో కలిసి కరణ్దిగి ప్రాంతం నుంచి ఇస్లామ్పూర్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. మైనార్టీ ఓట్ల కోసమే బంగ్లా నటులను తృణమూల్ రంగంలోకి దింపిందని బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోం శాఖ... ఫిర్దోస్ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.