విచిత్ర పరిస్థితులు.. ఓవైపు కేంద్రం భరోసా.. మరోవైపు నిర్దాక్షిణ్యంగా ఆ రాష్ట్రాలు..
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్తో భారత్లో పారిశ్రామిక రంగం కుదేలైంది. ఉత్పత్తులు నిలిచిపోయాయి. మార్కెట్లో డిమాండ్ పడిపోయింది. లాక్ డౌన్ ఎత్తేసినా ఈ రంగం ఎప్పటిలోగా కోలుకుంటుందో సరైనా అంచనాలు లేవు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తమవంతుగా పరిశ్రమలకు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని, కనీస వేతనాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతోంది. అసంఘటిత రంగంలోనూ అపాయింట్మెంట్ లెటర్స్,హెల్త్ చెకప్స్ ఉండేలా చేస్తామని అంటోంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు భరోసా ఇస్తుంటే.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుండటం గమనార్హం.
యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై కార్మికుల జీవితాలు..
బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాలు చాలావరకు కార్మిక చట్టాలను రద్దు చేశాయి. ఫ్యాక్టరీల్లో కార్మికులకు కావాల్సిన మౌలిక సదుపాయాల దగ్గరి నుంచి మొదలు ఉద్యోగపరంగా పొందే అన్ని బెనిఫిట్స్లోనూ యాజమాన్యాలకే పూర్తి స్వేచ్చనిచ్చాయి. అంటే,యజమాని కార్మికుల పట్ల దయ తలిస్తేనే పని ప్రదేశంలో వారికి మంచి నీళ్లు,శుభ్రమైన టాయిలెట్స్,8గంటల పని,క్రమం తప్పకుండా వేతనం,హెల్త్ చెకప్లు వంటి సదుపాయాలు అందుతాయి. లేదంటే దేనికీ భరోసా లేదు. 12 గంటలు పనిచేయించుకోవడానికి ఫ్యాక్టరీలకు పూర్తి స్వేచ్చ ఉంటుంది.
అలా ఓవర్ టైమ్ 76 గంటల పాటు పనిచేయించకోవచ్చు. ఉద్యోగులను తమను ఇష్టానుసారం తీసేయవచ్చు,లేదా నియమించుకోవచ్చు. దీనికి ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. గతంలో 100 మంది కార్మికులను ఒకేసారి తొలగిస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా తొలగించారు. కాబట్టి పరిశ్రమల యాజమాన్యాలదే అంతిమ నిర్ణయం. వాళ్ల దయా దాక్షిణ్యాల పైనే కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆఖరికి ఫ్యాక్టరీల్లో కనీస భద్రత ప్రమాణాల తనిఖీకి కూడా నీళ్లు వదిలారు. ఇకపై ఆ సర్టిఫికేషన్ను థర్డ్ పార్టీకి అప్పగించారు.
ఆర్థిక నిపుణుల విమర్శలు
భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేని ఒక బలహీన క్షణాన్ని అదునుగా చేసుకుని ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఊడ్చిపారేయడం కార్మికుల భద్రతను అఘాతంలోకి నెట్టివేస్తాయని నల్సార్ యూనివర్సిటీకి చెందిన అమీర్ ఉల్లాఖాన్ అనే ఆర్థిక నిపుణుడు అభిప్రాయపడ్డారు. కార్మిక చట్టాలను పూర్తిగా ఎత్తివేస్తే ఆటవికత రాజ్యమేలుతుందని చెప్పారు. అంతేకాదు,విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దూరమయ్యేందుకు ఇది కూడా కారణమవుతుందన్నారు. ముస్తఫా అనే ఒక ప్రొఫెసర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. నిజానికి భారత్లో కార్మిక చట్టాలు ఎప్పుడూ కఠినంగా అమలవలేదన్నారు. కార్మిక చట్టాలు కఠినంగా అమలయ్యాయని చెప్పడం ఒక అపోహ అని పేర్కొనట్టు తెలిపారు.
అసలే కరోనా కాలం.. కార్మికుల భద్రతకు గ్యారెంటీ ఏదీ..
భారతదేశంలో సంఘటిత రంగం కేవలం 10శాతం మాత్రమే. అసంఘటిత రంగంలో దాదాపు 90శాతం మంది ఉద్యోగ,ఉపాధి పొందుతున్నారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న 10శాతం మంది కార్మికుల భద్రత కోసం ఉన్న చట్టాలనే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నప్పుడు.. ఇక అసంఘటిత రంగంలో కార్మికుల భద్రతకు కేంద్రం ఇస్తున్న హామీలు అమలవుతాయా అన్న సందేహాలు కలగకమానవు. కోవిడ్-19 తర్వాత పని ప్రదేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్,పరిశుభ్రత చాలా ముఖ్యమని కేంద్రం చెబుతోంది. అంతేకాదు,తక్కువ ఉద్యోగులతో కార్యకలాపాలు సాగించమని చెబుతోంది. కానీ ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ వంటి రాష్ట్రాలు కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయాన్ని పరిశ్రమల యాజమాన్యానికే వదిలిపెడుతున్నాయి. అసలే కరోనా కాలం.. పరిశ్రమల్లో శుభ్రమైన తాగునీరు అందించకపోతే,శుభ్రమైన టాయిలెట్స్ లేకపోతే,పని ప్రదేశాలను శానిటైజ్ చేయకపోతే,8గంటలకు బదులు 12గంటలు పనిచేయిస్తే.. కార్మికుల ఆరోగ్యం ఏమైపోవాలి అన్న ప్రశ్నలు తలెత్తకమానవు.
ఉద్యోగాలు పెరగడం నిజమే అయితే..
మొదట ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఆ తర్వాత గుజరాత్ కూడా అదే బాటలో పయనించింది. అసోం సైతం 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు కూడా కార్మిక చట్టాల్లో సడలింపుల గురించి సమాలోచనలు జరుపుతున్నాయి. ఈ చర్యల కారణంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాలు చెప్పడం కూడా ఆశ్చర్యంగా ఉందని.. ఒకవేళ అదే నిజమై ఎక్కువమందికి ఉద్యోగాలు దొరికితే.. 12 గంటల పని విధానానికి బదులు.. తక్కువ పని గంటలతో ఎక్కువ షిఫ్టుల్లో కార్యకలాపాలు సాగించాలి కదా అని అమీర్ ఉల్లాఖాన్ లాంటి ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.