డికే రవి కేసు త్వరలో నివేదిక: సీబీఐ సిన్హా
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చివరి దశలో ఉందని, అతి త్వరలో తుది నివేదికను తయారు చేసి న్యాయస్థానం ముందు సమర్పిస్తామని సీబీఐ డైరెక్టర్ అనీల్ కుమార్ సిన్హా తెలిపారు.
సోమవారం ఆయన బెంగళూరు వచ్చారు. ఇదే సందర్బంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసులో త్వరలో నివేదిక ఇస్తామని అన్నారు.
దర్యాప్తు సమయంలో సేకరించిన సాక్షాలు, ఆధారాలను పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు. దర్యాప్తు చేసే సమయంలో సీబీఐ అధికారులు చెప్పారు అంటు గతంలో మీడియాలో వచ్చిన వార్తలకు మాకు సంబంధం లేదని అనీల్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు.
డి.కే. రవి కేసులో త్వరలో తామే అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అక్రమ మైనింగ్ కేసులతో పాటు కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన కేసులు దర్యాప్తు చేస్తున్నామని, లాటరి స్కాం కేసు విషయంపై అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అనీల్ కుమార్ సిన్హా వివరించారు.