త్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే, ఇక పార్లమెంట్ లో, ముస్లీం మహిళలు !
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. దేశంలో ముస్లీం మహిళల వివాహ హక్కు చట్టంకు కేంద్రం అండగా నిలబడింది. తలాక్ తలాక్ తలాక్ అంటూ ఒకే సారి మూడు సార్లు చెప్పి అక్కడికక్కడే వివాహాన్ని రద్దుచేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఫోన్లు, వాట్సాప్ లు !
ఒకేసారి తలాక్ తలాక్ తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వడం శిక్షార్హమని పేర్కొంటున్న బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్తరాలు, ఫోన్లు, వాట్సాప్ల ద్వారా ముస్లీం మహిళలకు విడాకులు ఇస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
సుప్రీం కోర్టు
ఈ నేపథ్యంలో పలువురు ముస్లీం మహిళలు సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. ట్రిపుల్ తలాక్ తక్షణం చెప్పే విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సుప్రీం కోర్టు సూచించింది.
మూడు సార్లు చెబితే మూడేళ్లు జైలు
కేంద్ర క్యాబినేట్ ఆమోదంతో పార్లమెంట్ లో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంట్ లో త్రిబుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభిస్తే తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి, విడాకులు ఇచ్చే పురుషునికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
పార్లమెంట్ లో ?
బాధిత మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మాజీ భర్త నుంచి పోషణ భత్యాన్ని (భరణం) కోరేందుకు అవకాశం ఏర్పడింది. తక్షణ ట్రిపుల్ తలాక్ నేరం అని చెప్తున్న ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపై విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాని మోడీ పట్టు !
ఇప్పటికే ముస్లింలలో చాలా మంది దీనిపై చర్చ జరగాలని కోరుతున్నారు. గురువారం కోల్ కతా ముస్లీం ఇస్లామిక్ లా బోర్డు సభ్యులు త్రిపుల్ తలాక్ విషయంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఎలాగైన ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో త్రిపుల్ తలాక్ బిల్లుకు అమోదం తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.