గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ను 2శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది జూలై నెల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 7 శాతంగా ఉన్నింది. తాజాగా 2శాతం పెంచడంతో అది 9 శాతం అయ్యింది. మార్చిలో 5 శాతం ఉన్న డీఏను 2శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు 5శాతం ఉన్న డీఏ, పెంపుతో 7శాతానికి చేరుకుంది.
కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుండగా... 60 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందనున్నారు. పెరుగుతున్న ధరలు, జీవణప్రమాణాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగస్తులకు డియర్నెస్ అలవెన్స్లు ప్రకటిస్తుంది. ద్రవ్యోల్బణం ఆధారంగా డియర్నెస్ అలవెన్స్ను ప్రకటించి ఉద్యోగస్తులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చూస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ఉద్యోగులకు కానుక ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా తమ జీతాలు కూడా పెంచాలంటూ పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ను 3.68శాతానికి పెంచాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏడవ వేతన సంఘం మాత్రం ఒక ఫార్ములా ఆధారంగా ఫిట్మెంట్ ప్రకటించాలని నివేదిక ఇచ్చింది. దీంతో ఫిట్మెంట్ను 2.57గా ప్రకటించారు. దీంతో రూ.7వేలు ఉన్న కనీస వేతనం రూ. 18వేలకు పెరిగింది. అయితే దీన్ని రూ.26వేలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు.
50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచాలంటూ ఏడవ వేతన సంఘం ఇచ్చిన నివేదకకు నరేంద్ర మోడీ సర్కార్ గత జూలైలో ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే ఫిట్మెంట్ పెంపుపై నేషనల్ అనామలి కమిటీ వచ్చే వారంలో సమావేశమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.