కరోనా వ్యాక్సిన్ రాకపై కేంద్రం సానుకూల సంకేతాలు- త్వరలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీకి రాత్రింబవళ్లూ ప్రయత్నాలు సాగుతున్న వేళ వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే దీన్ని ఓపెన్ మార్కెట్లో పెడితే ప్రజల నుంచి కార్పోరేట్ సంస్ధల వరకూ అందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో కరోనా వ్యాక్సిన్ నిర్వహణకు ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది.
భారత్లో రోగులకు తగిన కరోనా వ్యాక్సిన్ ను గుర్తించడం, వాటి కొనుగోళ్లు చేపట్టడం, తిరిగి రోగులకు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే యంత్రాంగం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయబోతోంది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షతన పనిచేసే ఈ టాస్క్ఫోర్స్ ... ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉపాధ్యక్షులుగా ఉండబోతున్నారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా నియమిస్తారు.
కరోనా వ్యాక్సిన్ గుర్తింపుతో పాటు వాటిని ఏయే సంస్ధల నుంచి కొనుగోలు చేయాలి, వాటి ధరల నిర్ణయం, ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటుకు ఏయే ధరలకు విక్రయించాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉంచాలన్న అంశాలను ఈ టాస్క్ఫోర్స్ నిర్ణయించనుంది. తాజా పరిణామాలతో కేంద్రం కూడా కరోనా వ్యాక్సిన్ రాకపై ఆశాభావంగా ఉన్నట్లు తెలుస్తోంది.