దేవాలయాల హుండీ డబ్బులను బ్యాంకుల్లో జమచేయండి
న్యూడిల్లీ: చిల్లర కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. దేవాలయాల్లోని హుండీల్లో ఉన్న చిల్లరను, విరాళంగా వచ్చిన నగదును వెంటను బ్యాంకుల్లో జమచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా దేవాలయాల పాలకవర్గాలను కోరింది.
పెద్ద నగదు రద్దు కారణంగా నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా చిల్లర కష్టాలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు ఆలయాలకు వచ్చిన చిల్లర నగదును, విరాళంగా వచ్చిన నగదును బ్యాంకుల్లో జమచేయాలని కేంద్రం ఆదేశించింది.
దేవాలయాల్లోని హుండీల్లో భక్తులు ఎక్కువసంఖ్యలో చిల్లరను జమచేస్తుంటారు. ఈ చిల్లరను బహిరంగ మార్కెట్లోకి వస్తే ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఆలయాల ట్రస్టులను కోరారు.
దేవాలయాల్లోని హుండీల్లో వచ్చిన చిల్లరను బ్యాంకుల్లో జమచేస్తే సగం ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.అయితే చిల్లరను లెక్కించేందుకు మాత్రం చిల్లర లెక్కింపు యంత్రాలు అవసరం ఉంటాయి.కేంద్ర ప్రభుత్వ వినతిని ఆలయ పాలకవర్గాలు ఆమోదిస్తే చిల్లర కష్టాలు తీరే అవకాశం ఉంది.