విద్యుత్ రంగంలో కేంద్రం భారీ మార్పులు- వినియోగదారుల హక్కులకు పెద్దపీట- కొత్త బిల్లు...
విద్యుత్ రంగంలో ఏళ్ల తరబడి సంస్కరణలకు నోచుకోకుండా ఉండిపోవడం వల్ల కోట్లాది రూపాయల నష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సంస్కరణలను భారీ ఎత్తున అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం ఇప్పుడు తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇందులో ప్రధానంగా కరెంటు బిల్లుల చెల్లింపుతో పాటు వినియోగదారుల హక్కులకు సంబంధించిన పలు అంశాల్లో భారీ మార్పులు చేపట్టే్ందుకు కేంద్రం ఓ కొత్త ముసాయిదా బిల్లును రూపొందింది. దీనిపై అభిప్రాయాలు తీసుకున్నాక త్వరలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చే్స్తోంది.
వెయ్యి దాటితే ఇక ఆన్లైన్...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ సంస్ధలు లక్షల రూపాయల బిల్లులు కూడా నేరుగా కానీ, చెక్కుల రూపంలో కానీ, ఆన్లైన్లో కానీ స్వీకరిస్తున్నాయి. ఇకపై వెయ్యిరూపాయలు దాటిన ప్రతీ కరెంటు బిల్లునూ తప్పనిసరిగా ఆన్లైన్లోనే చెల్లించేలా మార్పు చేస్తున్నారు. వెయ్యి రూపాయల కంటే తక్కువగా ఉన్న బిల్లులు మాత్రమే ఇకపై నేరుగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్ధలు ఆన్లైన్ విధానంలోనే బిల్లులను స్వీకరిస్తున్నాయి. ఇకపై కేంద్రం వెయ్యి రూపాయల నుంచి దీన్ని ఆన్లైన్ చెల్లింపులకు మాత్రమే అనుమతించబోతోంది. ఈ మేరకు కొత్త వినియోగదారుల హక్కుల చట్టం ముసాయిదాలో పేర్కొన్నారు. కొత్త బిల్లు జనరేట్ కాగానే వినియోగదారుడికి మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపాలి. చెల్లించేదుకు కనీసం పది రోజుల గడువివ్వాలి. బిల్లు పంపడంలో 60 రోజులకు పైగా ఆలస్యం జరిగితే వినియోగదారుడికి 2 నుంచి 5 శాతం రాయితీ కూడా ఇవ్వాలి.
ఇక సులభంగా కొత్త కనెక్షన్లు..
మన దేశంలో విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి ఉన్న నిబంధనలు ఏ దేశంలోనూ ఉండవన్న పేరుంది. విద్యుత్ కనెక్షన్ కావాలంటే అధికారులు చుక్కలు చూపించడం చూస్తూనే ఉంటాం. కానీ ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న తాజా ముసాయిదా బిల్లులో 10 కిలోవాట్ల వరకూ కరెంటు కనెక్షన్ కావాలంటే గుర్తింపు కార్డుతో పాటు స్ధలం లేదా భవనానికి యాజమాన్య హక్కు పత్రం సమర్పిస్తే సరిపోతుంది. నిబంధనల మేరకు కనెక్షన్ ఫీజు చెల్లిస్తే చాలు. గుర్తింపు కార్డుగా పాస్పోర్ట్ లేదా ఆధార్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ రెండు పత్రాలు సమర్పిస్తే కొత్త కనెక్షన్ పొందవచ్చు.
దరఖాస్తులూ ఆన్లైన్లోనే..
ఇకపై కొత్త కనెక్షన్ కావాలన్నా, లేక పాత కనెక్షన్లో మార్పులు, చేర్పులు చేయాలన్నా ఆన్లైన్లో దరఖాస్తుకు వీలు కల్పిస్తున్నారు. వీటి కోసం అవసరమైన పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు. లేదా విద్యుత్ సంస్ధలకు సమర్పించిన హార్డ్ కాపీలను వారు డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఇలా వచ్చాక గ్రామాల్లో నెల రోజుల్లో, పట్టణాల్లో 15 రోజుల్లో, మెట్రో నగరాల్లో వారం రోజుల్లో కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్నాక ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. అలాగే మీటర్ కాలిపోతే గ్రామాల్లో మూడు రోజుల్లో, పట్టణాలు, నగరాల్లో 24 గంటల్లో కొత్త మీటర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
రీడింగ్ సమస్యలపై భారీ ఊరట..
విద్యుత్ మీటర్లలో రీడింగ్ ఎక్కువగా చూపించడం కూడా వినియోగదారులకు పెద్ద సమస్యే. ఇందుకోసం మీటర్ రీడింగ్ ఎక్కువగా వచ్చిందని లేదా తక్కువగా వచ్చిందని అధికారులు గుర్తించినప్పుడు ఆ మొత్తాన్ని బిల్లులోనే సర్దుబాటు చేయాలి. వినియోగదారులు దాన్ని అంగీకరించకపోతే మాత్రం వారు కోరుకున్న థర్డ్పార్టీతో విచారణ చేయించవచ్చు. ఇలా విచారణ చేయించేందుకు అధికారులు థర్డ్ పార్టీల వివరాలను అందుబాటులో ఉంచాలి. విద్యుత్ మీటర్ ఇంటి బయట అమర్చి ఉంటే డిస్కంలు, లోపల పెడితే ఇంటి యజమానే దాని రక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రీడింగ్ సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు 30 రోజుల్లోపు ఉచితంగా పరిష్కారం చూపాలి. వినియోగదారులు దీర్ఘకాలం ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లిస్తే ఎలాంటి బిల్లులు పంపకుండా కనెక్షన్ యథాతథంగా ఉంచాల్సిందే. పాత బిల్లులు చెల్లించలేదని కరెంటు నిలిపేస్తే చెల్లించిన ఆరు గంటల్లోపు తిరిగి విద్యుత్ పునరుద్ధరించాలి.
Recommended Video
ప్రీపెయిడ్ మీటర్ల విధానం..
కొత్తగా ప్రీపెయిడ్ మీటర్ల విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇకపై కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే ప్రీపెయిడ్ మీటర్ తప్పనిసరి. మినహాయింపు కావాలంటే కమిషన్ ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్నాక ముందస్తుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జ్ మొత్తం అయిపోగానే కరెంటు ఆటోమేటిగ్గా నిలిచిపోతుంది. తిరిగి రీఛార్జ్ చేయగానే కరెంటు సరఫరా పునరుద్దరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం కొత్త బిల్లు చెబుతోంది. వినియోగదారులు కనెక్షన్ శాశ్వతంగా తొలగించాలని కోరినప్పుడు డిపాజిట్ నుంచే సర్దుబాటు చేసుకోవాలి. మిగిలిన మొత్తం ఉంటే వారం రోజుల్లో చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలి. మరోవైపు వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్ సరపరా చేయాలని, రైతులకు మినహాయింపు ఉంటుందని కొత్త బిల్లు చెబుతోంది.