ఈ ఏడాది హజ్ యాత్రపై కేంద్రం క్లారిటీ.. సౌదీ ప్రభుత్వ సూచన మేరకే
కరోనా వైరస్ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ముస్లింలు ఏటా వెళ్లే పవిత్ర హజ్ యాత్రపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఏటా హజ్ యాత్రకు వెళ్లే లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపనుంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. కరోనా భయాలతో బయటి దేశాల నుంచి రాకపోకలను చాలా దేశాలు అనుమతించడం లేదు. దీంతో ఏటా ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసే సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఈసారి చేతులెత్తేసింది. ఈ ఏడాది హజ్ యాత్రకు యాత్రికులను పంపొద్దంటూ పలు దేశాలను సౌదీ ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
హజ్ యాత్ర కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు వాపస్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. డైరెక్ట్ ట్రాన్స్ ఫర్ ద్వారానే డబ్బులు వెనక్కి ఇవ్వనున్నారు. అదే సమయంలో ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతి లభించిన వారు వచ్చే ఏడాది దాన్ని వినియోగించుకోవచ్చని కేంద్రం మరో ఆఫర్ కూడా ఇచ్చింది.
భారత్, సౌదీ అరేబియా ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం ఈ ఏడాది 2 లక్షల మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లాల్సి ఉంది. అయితే పలుమార్లు సంప్రదింపుల తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వమే వెనక్కి తగ్గడంతో కేంద్రం కూడా యాత్రను రద్దు చేయక తప్పలేదు.