"సివిల్స్" ఏజ్ లిమిట్ తగ్గించడం లేదు.. స్పష్టం చేసిన కేంద్రం
ఢిల్లీ : ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల "ఏజ్ లిమిట్" తగ్గిస్తున్నారనే వార్త మంగళవారం వైరల్ గా మారింది. అయితే అది నిజం కాదంటూ కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. గరిష్ఠ వయోపరిమితి తగ్గించే విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు లేవని తేల్చి చెప్పింది. ఈమేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన చేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇప్పటిదాకా మాగ్జిమమ్ ఏజ్ లిమిట్ 32 సంవత్సరాలుగా ఉంది. అయితే దాన్ని 27 ఏళ్లకు కుదించాలని నవంబర్ నెలలో నీతి ఆయోగ్ సూచించింది. ఈనేపథ్యంలో సివిల్ సర్వీసెస్ కు హాజరయ్యే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి తగ్గించబోతున్నారనే కథనాలు వచ్చాయి. అయితే తాజాగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో అది తప్పని తేలింది.
1960ల్లో సివిల్స్ పరీక్ష రాయాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ 24 ఏళ్లుగా ఉండేది. అది కాస్తా ప్రస్తుతం 32 ఏళ్లకు చేరింది. దీంతో పాటు వికలాంగులకు పదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు అదనంగా మినహాయింపు ఉంటోంది. అదలావుంటే 32 ఏళ్ల ఏజ్ లిమిట్ ను తగ్గిస్తే చాలామంది సమర్థులు సివిల్స్ కు దూరమయ్యే ఛాన్సుంది.
సివిల్స్ సాధనే ధ్యేయంగా కొందరు చాలాసార్లు పరీక్షలు రాస్తుంటారు. ఒకవేళ ఏజ్ లిమిట్ తగ్గితే సివిల్స్ ధ్యేయంగా కలలు కనేవారికి ఆ లక్ష్యం కలగానే మిగిలిపోతుంది. మొత్తానికి ఏజ్ లిమిట్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే మంత్రి ప్రకటనతో సివిల్స్ అభ్యర్థులకు ఊరట కలిగినట్లైంది.