ఆధార్ వద్దా? రద్దు చేసుకుంటారా? కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా? అయితే ఆధార్ కార్డు తీసుకురండి. జాబ్ లో జాయిన్ అవుతున్నారా? అయితే ఆధార్ వెంట తీసుకెళ్లండి. మొబైల్, గ్యాస్ కనెక్షన్ కావాలా? అయితే ఆధార్ నెంబరివ్వండి. ఇలా ప్రతిదానికి ఆధార్ లింక్ పెట్టడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదలావుంటే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇక ఆధార్ కష్టాలు తప్పనున్నాయి.
ఆధార్ చట్టం మార్చేలా ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. కొత్త ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టిన ప్రయత్నాలు ఫైనల్ దశకు వచ్చాయి. దీంతో ఎవరైనా సరే తమ ఆధార్ నెంబర్ ను విత్ డ్రా చేసుకునే ఛాన్స్ రానుంది.
బయోమెట్రిక్స్, డేటా వాపస్
ఒకవేళ కేంద్రం తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఆధార్ కార్డు అవసరం లేదనుకునేవారు నిరభ్యంతరంగా రద్దు చేసుకోవచ్చు. బయోమెట్రిక్స్ తో పాటు డేటా కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ప్రతిదానికి ఆధార్ కార్డుతో ముడిపెట్టడంపై కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. తమ వ్యక్తిగత సమాచారానికి భంగం కలుగుతోందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈక్రమంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సుప్రీం తీర్పు నేపథ్యంలో..!
తాజాగా ఆధార్ కార్డు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వ్యక్తులకు సంబంధించిన ఆధార్ డేటాను ప్రైవేట్ సంస్థలు వాడరాదని ఆదేశాలిచ్చింది. అంతేకాదు ఆధార్ చట్టంలోని 57వ సెక్షన్ను ధర్మాసనం కొట్టివేసింది. బ్యాంక్ ఖాతాలు, మొబైల్ కనెక్షన్లకు లింక్ చేయడాన్ని కూడా వ్యతిరేకించింది.
ప్రతి ఒక్కరికి వర్తించాలి.. న్యాయశాఖ సూచనలు
ఆధార్ సంఖ్య వెనక్కి తీసుకునే అంశంపై యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UDAI) కొత్త ప్రతిపాదన చేసింది. 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా సరే తమ ఆధార్ను విత్డ్రా చేసుకునేందుకు 6 నెలల గడువు కేటాయించనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఆధార్ కు సంబంధించిన ఈ కొత్త ప్రతిపాదనను పరిశీలించిన న్యాయశాఖ.. ప్రతి ఒక్కరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.