రాష్ట్రాల మధ్య రన్నింగ్ రేస్: 20 తరువాత లాక్డౌన్ సడలింపుపై నిబంధనలు..కాస్సేపట్లో:
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా రెండోదశ లాక్డౌన్ ప్రస్తుతం ఆరంభమైంది. ఇదివరకు అమల్లో ఉన్న 21 రోజుల లాక్డౌన్ను వచ్చే నెల 3వ తేదీకి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండోదశ లాక్డౌన్ 19 రోజుల పాటు కొనసాగబోతోంది. తొలి వారం రోజుల పాటు అత్యంత కఠినంగా రెండో దశ లాక్డౌన్ను అమలు చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదివరకే వెల్లడించారు.
అదే సమయంలో- ఈ నెల 20వ తేదీ తరువాత కొంత సడలింపు ఇస్తామని, తాము నిర్దేశించే ప్రమాణాలను అందుకున్న రాష్ట్రాలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తామంటూ ఆయన ఓ ఛాయిస్ ఇచ్చారు. ఈ ప్రమాణాలు గానీ, నిబంధనలు గానీ ఎలా ఉంటాయనేది ఇప్పటిదాకా వెల్లడించలేదు. అత్యంత కఠినంగా ఉంటాయని మాత్రమే మోడీ తన ప్రసంగంలో చెప్పుకోచ్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు మరి కాస్సేపట్లో వెల్లడి కానున్నాయి.
మోడీ ఇచ్చిన ఈ ఛాయిస్.. ఒకరకంగా కొన్ని రాష్ట్రాల మధ్య రన్నింగ్ రేస్కు తెర తీసినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి స్వచ్ఛందంగా లాక్డౌన్ను పొడిగించిన తెలంగాణ, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలను పక్కన పెడితే.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించడానికి మరి కొన్ని రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం ఏర్పడటానికి కారణం కావచ్చని అంటున్నారు.
లాక్డౌన్ వల్ల ఏపీ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రాబడిని కోల్పోయాయి. దీన్ని అధిగమించడానికి లాక్డౌన్ను హాట్స్పాట్లు, రెడ్జోన్లకే పరిమతం చేయాలంటూ ప్రధానమంత్రికి సూచించారు కూడా. అలాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల ప్రమాణాలను అందుకోవడానికి తమవంతు కృషి చేయడానికి అవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రమాణాలను అందుకుంటే కొంతమేరకైనా సడలింపు ఉంటుందని ఆశిస్తున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు.
Recommended Video
దేశ ఆర్థిక వ్యవస్థను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం పలు రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కొన్ని అంశాల్లో సడలింపు ఉన్నప్పటికీ ప్రజా రవాణాను నియంత్రించవచ్చని, జిల్లాల మధ్య రాకపోకలకు అనుమతి ఉండకపోవచ్చని చెబుతున్నారు. నిత్యావసర సరుకులు, ఫార్మా, అత్యవసర సేవల వంటికి మాత్రమే అనుమతి ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు ఉంటాయని తెలుస్తోంది.