రూ. 300 కోట్లు: రక్షణ దళాలకు మరింత స్వేచ్ఛనిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల నిధిని ఆయుధాల కొనుగోలుకు ఏర్పాటు చేసిన కేంద్రం తాజాగా సైన్యానికి మరింత స్వేచ్ఛనిచ్చింది. రూ .300 కోట్ల వరకు ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేసుకునే అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టింది.
పరిమిత మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం ఉండదు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశం జరిగింది. రూ. 300 కోట్ల వరకు ఎన్నైనా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని వెల్లడించింది.
లడఖ్ సహా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై సమీక్షించింది. సైన్యాన్ని మరింత పటిష్టంగా మార్చాలని అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇకపై అత్యవసర పనుల నిర్వహణ కోసం ఆయుధాలు కొనుగోలు చేసుకునే ప్రత్యేక అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టింది.
అత్యవసర పనుల నిమిత్తం ఆయుధాలు కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి డీఏసీ బదిలీ చేసింది. పెట్టుబడి కోసం రూ. 300 కోట్లు ఉపయోగించుకోవచ్చు. దీంతో ఆయుధాల దిగుమతి కాలం ఏడాది కంటే తగ్గుతుంది అని రాజ్నాథ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
The DAC delegated the powers for progressing urgent Capital Acquisition Cases upto Rs 300 crores to the Armed Forces to meet their emergent operational requirements.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 15, 2020
చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలతో ఆధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలకు భారత్ ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కూడా త్వరలోనే భారత్ చేరనున్నాయి.