హైదరాబాద్ చుట్టూ 'RRR'కు కేంద్రం గ్రీన్ సిగ్నల్... తెలంగాణ అభివృద్దికి గేమ్ ఛేంజర్....
ఆర్ఆర్ఆర్... హైదరాబాద్ చుట్టూ 338కి.మీ మేర నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు... ఇది ఆర్థికంగా భారమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గత నెలలో పక్కన పెట్టేసింది. దీంతో చాలామంది దీనిపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఎట్టకేలకు కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సోమవారం(ఫిబ్రవరి 22) వెల్లడించారు.
గడ్కరీని కలిసిన కిషన్ రెడ్డి...
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా కిషన్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ నేతల బృందం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. బీజేపీ నేతల విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. గడ్కరీతో భేటీ అనంతరం కిషన్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. 'హైదరాబాద్ నగరానికి 50కి.మీ నుంచి 70కి.మీ దూరంలో,ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డుకు 30కి.మీ దూరంలో ఈ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. రాష్ట్రంలో 40శాతం మంది ప్రజలకు రింగ్ రోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.' అని కిషన్ రెడ్డి తెలిపారు.
మొదటి దశలో సంగారెడ్డి-చౌటుప్పల్...
రీజినల్ రింగ్ రోడ్డు మొదటి దశలో సంగారెడ్డి-చౌటుప్పల్ వరకు 158కి.మీ మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.9522కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. రెండో దశలో చౌటుప్పల్-సంగారెడ్డి మధ్య 182కి.మీ మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి,రెండో దశకు మొత్తం రూ.17వేల వరకు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్కు వచ్చే అన్ని హైవేలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది.
తెలంగాణ అభివృద్దిలో గేమ్ ఛేంజర్...
తెలంగాణ అభివృద్దిలో రీజినల్ రింగ్ రోడ్డు ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని... ఈ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ అభివృద్ది ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు.ఎన్హెచ్-65, ఎన్హెచ్-44, ఎన్హెచ్-163, ఎన్హెచ్-765లను కలుపుతూ ఈ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో లాజిస్టిక్ పార్కులతో పాటు చుట్టుపక్కల కొత్త టౌన్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. వీటి చుట్టుపక్కల భూములు ఎకరా రూ.1కోటి వరకు పలుకుతున్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.