సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్ కు కేంద్రం సన్నాహాలు.. ఎప్పటి నుంచో తెలుసా...?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు, మృతులు నమోదవుతూనే ఉన్నారు. అయినా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లాక్ డౌన్ విధించే పరిస్ధితి కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులు ఇచ్చినందున సినిమా రంగానికి కూడా మినహాయింపులు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా ఈ మేరకు వివిధ సినీ పరిశ్రమల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ హోం మంత్విత్వశాఖకు ఓ లేఖ రాసింది.
తాజా పరిస్ధితుల నేపథ్యంలో ఆగస్టు నెలలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లు తిరిగి ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని తాజా లేఖలో సమాచార ప్రసారశాఖ హోంశాఖను కోరింది. అయితే ఆగస్టు 1 నుంచి వీటిని ప్రారంభించాలా లేక మధ్యలో ఎప్పుడైనా ప్రారంభిస్తారా అన్నది హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అమిత్ ఖారే తెలిపారు. సినిమా హాళ్లను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తాము హోంశాఖను కోరినట్లు ఆయన వెల్లడించారు.
ఒకవేళ ఆగస్టులో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైనా తాజా సిఫార్సుల ప్రకారం సీటుకూ, సీటుకూ మధ్య గ్యాప్ ఉండేలా, ఓ వరుసకూ, వరుసకూ మధ్య గ్యాప్ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. భౌతిక దూరంతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు అన్నీ పాటించేలా థియేటర్స్, మాల్స్ పై నియంత్రణ ఉండబోతున్నట్లు సమాచారం.