ఆ కంపెనీల అద్దెలు రద్దు .. సాఫ్ట్ వేర్, స్టార్టప్ కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్ ..
కరోనా వైరస్ నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్ తో ఆర్ధిక రంగం కుదేలైంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు బాగా దెబ్బ తిన్నాయి. చాలా కంపెనీలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఉద్యోగులను తొలగిస్తున్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అయితే విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా సాఫ్ట్వేర్, స్టార్టప్ కంపెనీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కాసింత ఊరటనిచ్చింది.
కరోనా నేర్పిన జీవితం: సింపుల్ గా బతకటానికి అలవాటు పడుతున్న జనాలు
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్లలో ఉంటున్న కంపెనీల అద్దెలను రద్దు చేసింది కేంద్ర సర్కార్ . మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేదని కేంద్ర సమాచార శాఖ సదరు కంపెనీలకు ప్రకటించింది. ఎస్టీపీఐకి దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో భవనాలు ఉండగా వాటిలో 200 ఐటీ, ఐటీఈఎస్, ఎంఎస్ఎఈ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో నష్టాలను చవి చూస్తున్న వారికి ఊరట నిచ్చేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ట్వీట్లో ఇలా పేర్కొన్నారు
భారతదేశంలోని 60 ఎస్టిపిఐ కేంద్రాల నుండి పనిచేస్తున్న ఐటి యూనిట్లు / స్టార్టప్లకు మార్చి 1 , 2020 జూన్ 30 2020 మధ్య కాలానికి అద్దె చెల్లించకుండా మాఫీ ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దాదాపు 200 మంది ఐటీ, స్టార్టప్ కంపెనీలకు ప్రయోజనం ఉంటుంది. ఇక ఈ చిన్న మరియు మధ్యతరగతి యూనిట్లు 3000 ప్రత్యక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నాయని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ 4 నెలల కాలంలో ఈ యూనిట్లకు అందించిన అద్దె మినహాయింపు మొత్తం ఖర్చు సుమారు 5 కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తుంది.