దివ్యాంగులకు కేంద్రం బంపర్ ఆఫర్- టోల్ప్లాజా ఫీజు మినహాయింపు- లోక్సభలో ప్రకటన
దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే దివ్యాంగులకు విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న కేంద్రం.. తాజాగా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది.
దేశంలో ఇకపై దివ్యాంగులు టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ లోక్సభలో ప్రకటించారు. లోక్సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిదురీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దివ్యాంగులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. దివ్యాంగుల కోసం ఇప్పటికే కేంద్రం పలు మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దివ్యాంగుల కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్ ట్సాక్స్ను ఎత్తేసిన విషయాన్ని నితిన్ గడ్కరీ లోక్సభలో గుర్తు చేశారు. యూజర్ ఫ్రెండ్లీ రీతిలో దివ్యాంగులకు వాహనాలు డిజైన్ చేయాలంటూ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా భారీ ఎత్తున దివ్యాంగులకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు రిజర్వేషన్లు సహా పలు ప్రోత్సహకాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.