కశ్మీర్ క్లీనింగ్కి మోడీ, షా స్కెచ్: లెఫ్టినెంట్ గవర్నర్గా నరసింహన్ కాదు.. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్
కాశ్మీర్ పైన ఎంత సంచలనంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో..ఇప్పుడు మరో నియామకానికి సంబంధించి అదే స్థాయిలో నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పుడు కేంద్రం చేతిలోకి జమ్ము కాశ్మీర్ వెళ్లటం ..అక్కడ పరిస్థితులను పూర్తిగా అదుపులో ఉంచటం కేంద్ర ప్రతిష్ఠకు సంబంధించిన అంశం. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటంతో సమర్ధవంతమైన లెఫ్టినెంట్ గవర్నర్ ను అక్కడ నియమించాలని కేంద్రం భావిస్తోంది.
దీని కోసం ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే కేంద్రం అనూహ్యంగా కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్ పేరును ఖరారు చేసింది. స్మగ్లర్ వీరప్పన్ను అంతమొందించిన అధికారిగా విజయ్ కుమార్ పేరు సాధించారు. ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మరో గుర్తింపు ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా విజయ్ కుమార్..!
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. దీంతో..ఇప్పుడు అక్కడ పాలనా వ్యవహారాలు మొత్తంగా కేంద్రం చేతిలోకి వచ్చాయి. శాంతి భద్రతలతో పాటుగా పాలన వ్యవహా రాల విషయంలో కేంద్రమే బాధ్యత తీసుకోవాల్సి ఉంది. దీని కోసం అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం మీద కేంద్రం ఫోకస్ చేసింది. తొలుత ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ పేరు పైన చర్చ సాగింది. నరసింహన్ గతంలో కేంద్ర నిఘా ..రా విభాగాల్లో పని చేసిన అనుభవంతో పాటుగా జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ థోవల్ కు సన్నిహితుడు కావటంతో నరసింహన్ కు అవకాశం దక్కుతుం దని భావించారు. అయితే, అనూహ్యంగా కేంద్రం కొత్త పేరు తెర మీదకు తెచ్చింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లఢక్ వ్యవహారాలను గవర్నర్ సత్యపాల్ మాలిక్ చూస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పాలనను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా గుర్తింపు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన విజయ్ నియమానికి రాష్ట్రపతి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో కశ్మీర్ తొలి ఎల్జీగా నియామకమైన అధికారిగా విజయ్ గుర్తింపు పొందనున్నారు. విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు పెద్ద సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలను టెన్షన పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను 2004 అక్టోబర్లో అంతమొందించిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్గా వ్యవహరించారు. వీరప్పన్ను పట్టుకున్న తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు చెన్నై పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్కౌంటర్ చేశారు. 2008లో హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని మోదీ..అమిత్ షా ఏరికోరి..
ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా ఏరి కోరి విజయ్ కుమార్ ను ఏరి కోరి ఎంపిక చేసారు. కేంద్రంలో..ప్రత్యేకంగా కాశ్మీర్ లో పరిస్థితుల పైన పూర్త అవగాహన ఉండటం.సమర్ధవంతమైన అధికారి కావటంతో ఆయన వైపు వీరిద్దరు మొగ్గు చూపినట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేసి పదవీ విరమణ అయ్యారు. ఆ తర్వాత కూడా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం, హోమ్, ఫారెస్ట్, ఎకాలజీ & ఎన్విరాన్మెంట్, హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్, యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, హాస్పిటాలిటీ & ప్రోటోకాల్, సివిల్ ఏవియేషన్, ఎస్టేట్స్, ఇన్ఫర్మేషన్ పోర్ట్ఫోలియోలతో జమ్ముకశ్మీర్ గవర్నర్కు సలహాదారుగా ఉన్నారు. అందుకే ఇంతటి రికార్డ్ ఉన్న విజయ్ను కశ్మీర్కు పంపితే సమర్థవంతంగా చూసుకుంటారని ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా నిర్ణయించారు. ఇక..విజయ్ కుమార్ నియామక ఉత్తర్వులు లాంఛనమే.