ఒకే దేశం .. ఒకే కార్డు ... దేశవ్యాప్తంగా రేషన్ కోసం కేంద్రం కసరత్తు ..!
న్యూఢిల్లీ : పేదలకు అందించే రేషన్ సరుకులు .. దేశంలో ఎక్కడైనా ఇస్తే ఎలా ఉంటుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా రేషన్ అందజేసేందుక కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆహారభద్రతపై సంబంధిత కార్యదర్శులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ, ఎన్డబ్యూసీ) అధికారులతో గురువారం ఢిల్లీలో చర్చించారు
వన్ రేషన్ ..
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు లక్ష్యం దిశగా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి పాశ్వాన్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రజా పంపిణీ విధానానికి సంబంధించి వ్యవస్థను కంప్యూటీకరించడం, ఆహార ధాన్యాల పంపిణీ, నిల్వల విషయంలో పారదర్శకత, ఎఫ్సీఐ, సీడబ్యూసీ, ఎన్డబ్యూసీ డిపోలను ఆన్లైన్ విధానంతో అనుసంధానించే అంశాలపై ఆయా విభాగ అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా పనిచేసే రేషన్ కార్డు విధానం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉపాధి కోసం తమ ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లే వారి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
అవినీతికి ఆస్కారం లేదు ..
దీంతో రేషన్ కార్డుల అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతామని వివరించారు. ఇందుకోసం కేంద్రం పరిధిలో కార్డుల సమాచారంతో ఒక వ్యవస్థను ఆహార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది. ఇందులో ఆహార, ప్రజా పంపిణీ విభాగం విధి నిర్వహణ కీలకమని మంత్రి పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం ఎఫ్సీఐ, సీడబ్ల్యూసీ, ఎన్డబ్య్లూసీ, ప్రైవేటు గోదాముల్లో 612 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేస్తున్నామని .. వీటిని 81 కోట్ల మందికి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. సరకులు కొనుగోలు నుంచి పంపిణీ వరకు అవినీతికి ఆస్కారం లేకుండా ఐటీ సేవలను వినియోగిస్తామని కేంద్రమంత్రి పాశ్వాన్ స్పష్టంచేశారు.
తెలుగురాష్ట్రాల్లో అమలు
కేంద్రం తీసుకొస్తున్న ఒకే దేశం, ఒకే రేషన్ కార్యక్రమాన్ని ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. సదరు రేషన్ కార్డుదారుల వివరాలు ఆధార్ కార్డుతో అనుసంధానించారు. దీంతో వారి ఫింగర్ ఫ్రింట్ నమోదు చేసి .. రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతుంది. ఇదే విధానాన్ని అమలు చేస్తామని మరికొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో ఒకే దేశం .. ఒకే రేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేస్తుంది.