సోనియాగాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం హైఓల్టేజీ షాక్: ఎస్పీజీ భద్రత తొలగింపు..!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం హైఓల్టేజీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎస్పీజీని తొలగించి, జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను మాత్రమే కల్పించేలా ఆదేశాలను జారీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఎస్పీజీ భద్రతను కల్పించేంత స్థాయిలో బెదిరింపులు (లో థ్రెట్) లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇది వరకే మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కొనసాగిన ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. రెండు నెలల కిందటే దీన్ని అమలు చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత లేదు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలోనే ఆయన కొనసాగుతున్నారు.
సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు ఎస్పీజీ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
సోనియాగాంధీ భర్త రాజీవ్ గాంధీ హత్యానంతరం ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాతి పరిస్థితులు కూడా ఎస్పీజీ భద్రతను కొనసాగించేలా ప్రేరేపించాయి. కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇక తొలగించే ఆలోచనే చేయలేదు.
తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి, సుశిక్షితులనై సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.