కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు: కేంద్రం కీలక నిర్ణయాలు, త్వరలోనే ఉపశమనం
న్యూఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలు ప్రజలకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరగడంతో సామాన్యులు ఉల్లి పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Recommended Video
ఏపీలో నేటి నుంచి రూ.40కే ఉల్లి- రైతు బజార్లలో విక్రయాలు
ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
ఉల్లి ధరలను తగ్గించడానికి, దేశీయ లభ్యతను మెరుగుపరచడానికి.. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రిటైల్, టోకు వ్యాపారులపై డిసెంబర్ 31 వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితిని కేంద్రం విధించింది. చిల్లర వ్యాపారులు ఉల్లిపాయను 2 టన్నుల వరకు మాత్రమే నిల్వ చేసుకోవచ్చ, హోల్సేల్ వ్యాపారులు 25 టన్నుల వరకు నిల్వ ఉంచడానికి అనుమతి ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ స్పష్టం చేశారు.
త్వరలోనే నిత్యావసరాల చట్టం అమల్లోకి..
గత నెలలో పార్లమెంటులో ఆమోదించిన ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి ఉందని.. ఇది అసాధారణమైన ధరల పెరుగుదల పరిస్థితిలో పాడైపోయే వస్తువులను నియంత్రించడానికి వీలు కల్పిస్తుందని ఆమె అన్నారు. ఆ తర్వాత, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్ ఈ మేరకు ట్వీట్ చేశారు: ‘పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి, హోర్డింగ్స్ను అరికట్టడానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవ దశను తీసుకుంది. చిల్లర వ్యాపారులపై 2 టన్నుల స్టాక్ పరిమితిని, టోకు వ్యాపారులపై 25 టన్నులను విధించింది' అని వెల్లడించారు.
కృత్రిమంగా ఉల్లి ధరలు పెంచేస్తున్నారు..?
ఉల్లి ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఖరీఫ్ పంట దెబ్బతిన్న నేపథ్యంలో గత కొద్ది వారాల్లోనే ఉల్లి ధరలు కిలోకు రూ .75 కు పైగా పెరిగాయి. ఇప్పుడు రూ. ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాక, కొందరు వ్యాపారులు అతి లాభాపేక్షతో అక్రమ నిల్వలు చేసి ధరలు కృత్రిమంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉల్లి నిల్వలపై కేంద్రం పరిమితులను విధించింది. దీంతో సరఫరా పెరిగి ఉల్లి ధరలు తగ్గనున్నాయి.
విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు గ్రీన్ సిగ్నల్..
ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరలను తగ్గించేందుకు విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. డిసెంబర్ 15 వరకు ఈ దిగుమతులు జరుగుతాయి. దీంతో సరఫరా పెరిగి ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉంది. కాగా, 37 లక్షల టన్నుల ఖరీఫ్ పంట మండిస్కు రావడం కొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది, దీంతో పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుంది. అంటే త్వరలోనే ఉల్లి ధరలు సామాన్యులకు అందుబాటులోనికి రానున్నాయి.