సోషల్ మీడియా, ఓటీటీల కొత్త మార్గదర్శకాలపై సుప్రీం ఫైర్- కఠిన చట్టాలకు కేంద్రం హామీ
దేశంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న సోషల్ మీడియా, ఓటీటీలకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే వీటి అమలుతో సోషల్ ప్లాట్ఫామ్స్ను కట్టడి చేయడం సాధ్యం కాదని అంతా భావిస్తున్నారు. ఇదే క్రమంలో దాఖలైన ఓ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రానికి అక్షింతలు వేసింది.
కేంద్రం సోషల్ మీడియా, ఓటీటీల కట్టడికి తీసుకొచ్చిన మార్గదర్శకాలు కోరల్లేనివంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా మీడియాల కట్టడికి మరింత కఠినమైన చట్టాలు అవసరమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయపడింది. వీటిపై దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... కేంద్రం తీరు సరిగా లేదని తెలిపింది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అమలు చేయకపోతే కఠిన శిక్షలు ఉండేలా చట్టాలు తీసుకురాలేరా అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
దీంతో కేంద్రం కూడా ఇరుకునపడింది. కేంద్రం తరఫున కేసు విచారణలో పాల్గొన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయాల ఆధారంగా కేంద్రం తప్పనిసరిగా అమలు చేస్తుందని హా్మీ ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతున్న తాండవ్ వెబ్ సిరీస్పై దాఖలైన కేసులో అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తున్నారని పురోహిత్పై యూపీ పోలీసులు ఇప్పటికే కేసులు పెట్టారు.