వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు విఫలం: డిసెంబర్ 3న మరోసారి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు.
అంతగాక, కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజ్ఞాన్ భవన్లో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 35 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోపాటు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించగా.. అందుకు రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు. కమిటీ ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో చర్చలు కొలిక్కిరాకుండానే ముగిశాయి.
Recommended Video
వచ్చే గురురవారం(డిసెంబర్ 3) మరోసారి రైతులతో కేంద్రం చర్చలు జరపనుంది. అప్పటి వరకు శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు తెలిపారు. కాగా, రైతు సంఘాల ప్రతినిధులతో భేటీకి ముందు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. చర్చల నేపథ్యంలో విజ్ఞాన్ భవన్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.