చర్యలకు దిగింది: పనిచేసే చోట్ల లైంగిక వేధింపులను అరికట్టేందుకు మంత్రులతో కమిటీ వేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఆఫీసుల్లో పని చేసే చోట్లా చాలామంది మహిళలపై లైంగిక వేధింపులు జరిగినట్లు మీటూ ఉద్యమం ద్వారా తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది మహిళలు తాము అనుభవించిన నరకాన్ని బహిర్గతం చేస్తున్నారు. దీంతో కేంద్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఆఫీసుల్లో ఇతరత్ర పనిచేసే చోట్ల మహిళలపై లైంగిక దాడులు లేదా వేధింపులు తగ్గాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని ఆదేశిస్తూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల బృందంతో కమిటీ వేసింది సర్కార్. కేంద్ర మంత్రిగా ఎంజే అక్బర్ రాజీనామా చేసిన కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
పనిచేసే చోట్ల మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రస్తుతం ఉన్న చట్టాలను బలోపేతం చేయడంలాంటి అంశాలపై మంత్రుల బృందం స్టడీ చేయనుంది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో సభ్యులుగా రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రహదారులు మరియు రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఉన్నారు. వీరు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసే దానిపై దృష్టి సారించి దానిపై 3నెలల్లోగా నివేదిక ఇస్తారు.
ఇప్పటికే మీటూ ఉద్యమం బలపడుతుండటంతో కేంద్రమంత్రి మేనకా గాంధీ బాధితులకు అండగా నిలిచారు. అప్పుడే తమ శాఖ ఓ కమిటీని ఏర్నాటు చేస్తుందని ప్రకటించారు. ప్రతి బాధితురాలు ఎంత నరకం అనుభవించి ఉంటుందో తను అర్థం చేసుకోగలదని మేనకా గాంధీ చెప్పారు.
ఇక పనిచేసే చోట్ల లైంగిక వేధింపులు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని ఆమె పిలుపునిచ్చారు.