వెబ్ సైట్లకు కేంద్రమంత్రి హెచ్చరిక : విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు
న్యూఢిల్లీ : ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. విషయమేదైనా క్షణాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్నెట్ అనుసంధానంగా పనిచేసే సోషల్ మీడియాను, పలు వెబ్ సైట్లను ఆసరాగా చేసుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు.
దాద్రి వంటి ఘటనలపై కొన్ని వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో విస్త్రృతంగా కథనాలు వెలువడడంతోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందన్నారు. గడిచిన మూడేళ్లలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కేసులు పెరగినట్లు గణాంకాలు చెబుతున్నాయని లోక్ సభలో వివరించారు కేంద్రమంత్రి కిరణ్.
ఉగ్రవాద సంస్థలయిన అల్ ఖైదా, ఐసిస్ వంటి సంస్థలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ యువతను తమవైపు తిప్పుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెబ్ సైట్స్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, విద్వేషాలను రెచ్చగొట్టడం, సైబర్ నేరాలు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.