మీకు మెంటల్ రాకూడదంటే వార్తలు చదవద్దు, నేను అదే పని చేస్తా, కేంద్ర మంత్రి షాకింగ్ సలహా !
బెంగళూరు: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ హెగ్డే మరోసారి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీ మెదడు, మీ బుర్రసరిగా పని చెయ్యాలంటే, మెంటల్ రాకుడదంటే తాను చెప్పిన పని చెయ్యాలని కేంద్ర అనంత్ కుమార్ హెగ్డే ఉచిత సలహా ఇచ్చారు.
ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలలో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మీరు డిజిటల్ మీడియాలో వార్తలు చదవరాదని, దిన పత్రికలు చూడరాదని, టీవీలో వార్తలు చూడకూడదని, ఆలా చేస్తే మీ మెదడు పాడైపోతుందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు.
సోషల్ మీడియాలో మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసి లేనిపోని సమస్యలకు దారి తీస్తున్నారని, ఇలాంటి వార్తలు చదివితే మీ మెదడు నాశనం అవుతోందని, మెంటల్ వస్తోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. తాను 10 సంవత్సరాల నుంచి దిన పత్రికలు చదవడం లేదని, టీవీల్లో వార్తలు చూడటం లేదని, అందుకే తన మెదడు చురుకుగా పని చేస్తోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చెప్పారు.
అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మీ షుగర్ లెవర్ సరిగా ఉండాలన్నా, బీపీ కంట్రోల్ లో ఉండాలన్నా, మెదడు చురుకుగా పని చెయ్యాలన్నా దిన పత్రికలు చదవకూడదని, టీవీల్లో వార్తలు చూడకూడదని ప్రజలకు సూచించారు.
అయితే మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని కేంద్ర మంత్రి అలా మాట్లాడారా ? లేదా పబ్లిసిటి కోసం మాట్లాడారా అనే అర్థం కాక బీజేపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. నిత్యం ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి నేడు వార్తలు చదవకూడదు, టీవీల్లో చూడకూడదు అంటూ ఇలా ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు.