ప్రొఫెసర్లు, లెక్చరర్లకు దీపావళి బొనాంజా: 7వ పే కమిషన్ ఫలాలు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర, యూజీసీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు దీపావళి పండగ ముందే వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏడో వేతన సంఘం ప్రయోజనాలను వారికీ అమలు చేయాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 7.58 లక్షల మంది ఆచార్యులకు ప్రయోజనం కలగనుంది.
'329 రాష్ట్ర విశ్వ విద్యాలయాలు, 12,912 కళాశాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు 2016, జనవరి 1 నుంచి ఏడో వేతన సంఘం ప్రయోజనాలు దక్కుతాయి. కేంద్ర నిధులుతో నడిచే డీమ్డ్ యూనివర్సిటీలు, 43 కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు ప్రయోజనాలు అందుతాయి' అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
వేతనాల పెరుగుదల దాదాపు 22-28 శాతం వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపుదల కోసం సెప్టెంబర్ నెలలో మోడీ ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో 22మంది సభ్యులున్నారు. ఇది ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలు ప్రవేశ పెట్టనుంది. నైపుణ్యాభివృద్ధి కోసం సంకల్ప్, స్ట్రైవ్ పథకాలు తీసుకొస్తున్నారు.