సెంట్రల్ విస్టా: మోడీ సర్కార్కు సుప్రీం కీలక ఆదేశాలు: అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి..ట్విస్ట్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ను నిర్మించడానికి అనుమతులను ఇచ్చింది. దానితోపాటు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ముడిపడి ఉన్న అన్ని విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించింది. ప్రత్యేకించి- పురావస్తు పరిరక్షణ కమిటీ నుంచి అనుమతులను తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది.
దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ వందలాది పిటిషన్లు సుప్రీంకోర్టుకు దాఖలయ్యాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులకు కిందటి నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అనంతరం పర్యావరణ వేత్తల ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రాజెక్టు పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీని నిర్మాణం ఫలితంగా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు విధ్వంసానికి గురవుతాయని, పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు కిందటి నెలలో కొన్ని ఆదేశాలను జారీ చేసింది. శంకుస్థాపనకు మాత్రమే అనుమతులను మంజూరు చేసింది. ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టకూడదంటూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణనను మంగళవారం నాటికి వాయిదా వేసింది. తాజాగా- ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం వినిపించిన వాదనలతో ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ఏకీభవించారు. మరొక న్యాయమూర్తి విభేదించారు. జస్టిస్ ఖన్విల్కర్, దినేష్ మహేశ్వరి ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా తమ తీర్పును వెలువడించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా దీన్ని విభేదించారు. నిర్మాణ పనులను ప్రారంభించడానికి ముందు ఈ ప్రాజెక్ట్తో ముడిపడి ఉన్న అన్ని విభాగాల అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశించారు. చారిత్రక, వారసత్వ కట్టడాలు, పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.