మెట్రో రైళ్లపై కేంద్రం తాజా గైడ్ లైన్స్ - టైమింగ్లో కీలక మార్పులు - ఆ స్టేషన్లలో మాత్రం ఆగదు
ఐదున్నర నెలల తర్వాత మెట్రో రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఈనెల 7 నుంచి వివిధ నగరాల్లో మెట్రో రైల్ సర్వీసుల్ని పునరుద్ధరించనున్నారు. వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాని నేపథ్యంలో మెట్రో ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం బుధవారం స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ) జారీ చేసింది. ప్రధానంగా ఫ్లాట్ ఫారంపై రైలు నిలిచే టైమింగ్, ఆయా స్టేషన్లకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి.
అన్ లాక్ 4.0లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవల్ని ప్రారంభించొచ్చంటూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. సర్వీసుల్ని ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనే నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో ఒక్కో నగరంలో ఒక్కో తేదీలో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, ప్రయాణికులు, సంస్థలకు జారీ చేసిన నిబంధనలు మాత్రం అంతటికీ వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. తాజాగా జారీ అయిన గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి..
కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవు. ఆయా స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలను పూర్తిగా మూసేసి ఉంచుతారు.
ప్రతి ప్రయాణికుడికి విధిగా థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తారు. కొవిడ్ లక్షణాలు లేనివాళ్లను మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తారు.
సోషల్ డిస్టెన్స్ నియమాలకు అనుగుణంగా రైలు లోపల ప్రత్యేక ఏర్పాట్లుంటాయి.
స్టేషన్ ఆవరణలో మాస్కులను అందుబాటులో ఉంచుతారు. అయితే ఉచితంగా మాత్రం కాదు. పొరపాటున మాస్క్ మర్చిపోయి వెళ్లేవాళ్ల కోసమే ఈ వెసులుబాటు. ప్రయాణికులు, సిబ్బంది అంతా మాస్క్ వేసుకోవడం మస్ట్.
మెట్రో రైలు బోగీలోపల అణువణువూ, స్టేషన్ పరిసరాల్లోనూ శానిటైజనేషన్ తప్పనిసరి. టోకన్లు, టికెట్లను కూడా శానిటైజ్ చేశాకే ఇస్తారు.
రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒకరినొకరు తగలకుండా, డిసెన్స్ పాటిస్తూ దిగడానికి వీలుగా ఫ్లాట్ ఫారంపై రైలును గతంలో కంటే ఎక్కువ సమయం నిలిపి ఉంచుతారు.
కేంద్రం మార్గర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, జైపూర్, కోల్ కతా, గుజరాత్, యూపీ మెట్రో రైల్ సంస్థలు అదనపు చర్యలు కూడా తీసుకోవచ్చు.
హైదరాబాద్ మెట్రో.. 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రవేశాన్ని నిషేధించింది. అన్ని మెట్రో స్టేషన్లలో లిఫ్టుల్ని మూసేసి ఉంచనున్నారు.
కొవిడ్ ఉదృతి నేపథ్యంలో ముంబైలో మెట్రో సర్వీసుల్ని అక్టోబర్ 20 నుంచి పున:ప్రారంభిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.