JNU protests:త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం, నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కొద్ది రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. పెంచిన హాస్టల్ ఫీజులను తగ్గించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో పార్లమెంటు పరిసరాల్లో 144 సెక్షన్ విధించింది.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో క్యాంపస్ బయట పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు క్యాంపస్ బయట మోహరించడాన్ని తప్పుబట్టింది జేఎన్యూ టీచర్స్ అసోసియేషన్. పార్లమెంటు ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో పోలీసులు క్యాంపస్ బయట మోహరించి ఉన్నారని మండిపడింది. జేఎన్యూ క్యాంపస్ వద్ద పోలీసుల మోహరింపును బ్యారికేడ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది జేఎన్యూ టీచర్స్ అసోసియేషన్. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పిన టీచర్ల సంఘం, పోలీసులు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.
Delhi: Jawaharlal Nehru University Students march towards Parliament over their demand of complete fee roll back along with other demands pic.twitter.com/iqdyDCzZQh
— ANI (@ANI) November 18, 2019
ఇదిలా ఉంటే జేఎన్యూ విద్యార్థులు పాలనావర్గం మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేంద్రం త్రిసభ్య కమిటీని వేసింది. జేఎన్యూ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విద్యార్థి సంఘాలు, పాలనా వర్గం మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలంటూ కేంద్ర మానవవనరుల శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. త్వరతగతిని చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీకి సూచించింది.
కొత్తగా హాస్టల్ ఫీజు పెంపు, కర్ఫ్యూ టైమింగ్స్, డ్రెస్ కోడ్ విధించడాన్ని జేఎన్యూ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో గత మూడువారాలుగా క్యాంపస్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలతో ఓ మెట్టు దిగొచ్చిన పాలనావర్గం కర్ఫ్యూ టైమింగ్స్లో మార్పులు, డ్రెస్ కోడ్లపై క్లాజ్లను తొలగించింది. అంతేకాదు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఫీజును 50శాతం తగ్గించింది. అయితే దీనిపై విద్యార్థులు ఒప్పుకోలేదు.. ఫీజు పెంపు ప్రభావం విద్యార్థులకు భారంగానే మారుతుందని చెబుతున్నారు.