రైతుకు మేలు: అత్యవసర వస్తువుల చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ మరో ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది.
అంతేగాక, అత్యవసర వస్తువుల చట్ట సవరణ(ఫైనాన్షియల్ కమోడిటీస్ యాక్ట్)కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. తృణ ధాన్యాలు, ఉల్లిపాయలు సహా వివిధ ఆహార పదార్థాలపై నియంత్రణను ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఈ చట్టాన్ని సవరించనుంది. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది.
వ్యవ్యసాయం, సహా ఇతర అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను ఏ రాష్ట్రంలోనైనా విక్రయించుకునేందుకు వీలుగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం ఆర్డినెన్స్ 2020కి కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు.
ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసిన మార్కెట్లే కాక రాష్ట్రంలోని కానీ, రాష్ట్రం వెలుపల కానీ పంట ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. వ్యవసాయదారునే నేరుగా అగ్రిగేటర్లు, పెద్ద రిటైలర్లు, ఎగుమతిదారులతో రైతులు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు మరో ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాలు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో పేర్కొన్న అంశాలకు కొనసాగింపుగా తీసుకున్నారని తెలిపారు. కోల్కతా పోర్ట్ ట్రస్ట్ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్గా పేరు మార్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.