OBC,EWS Reservation: ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గుడ్ న్యూస్... ఆల్ ఇండియా కోటాలో మెడికల్ రిజర్వేషన్లు
మెడికల్ అడ్మిషన్లలో ఆల్ ఇండియా కోటా రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం,ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)కు 10శాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నట్లు ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని తెలిపింది. ఎంబీబీఎస్,బీడీఎస్,పీజీ,డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు తాజా రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఈ రిజర్వేషన్ల ద్వారా ఓబీసీ నుంచి ప్రతీ ఏటా ఎంబీబీఎస్ కోర్సుల్లో 1500 మంది విద్యార్థులకు,పీజీ కోర్సుల్లో 2500 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ నుంచి ఎంబీబీఎస్లో 550 మంది విద్యార్థులకు,పీజీ కోర్సుల్లో 1000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఆల్ ఇండియా కోటా కింద ఎస్సీలకు 15శాతం,ఎస్టీలకు 7.5శాతం రిజర్వేషన్ అమలవుతోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఆల్ ఇండియా మెడికల్ కోటాలో ఓబీసీ,ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అమలుకానున్నాయి.
ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. 'ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి యూజీ,పీజీ,డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్ ఇండియా మెడికల్ కోటా కింద ఓబిసిలకు 27శాతం రిజర్వేషన్లు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మెడికల్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటాపై 1986లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ద్వారా ఏ రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థి అయినా ఇతర రాష్ట్రాల్లోని మంచి మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు వీలవుతుంది. 1986లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చినప్పటికీ 2007లో గానీ ఇది అమలవలేదు. ఆ సంవత్సరం నుంచి ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్ అమలుచేస్తూ వస్తున్నారు. తాజాగా ఓబీసీ,ఈడబ్ల్యూఎస్లను కూడా అందులో చేర్చారు.
గడిచిన ఆరేళ్లలో దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 56శాతం మేర పెరిగాయి. 2014లో 54,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా... ప్రస్తుతం 84,649 సీట్లు ఉన్నాయి. పీజీ సీట్లు 80శాతం మేర పెరగ్గా.. ప్రస్తుతం 54,275 సీట్లు ఉన్నాయి. ఇదే ఆరేళ్లలో దేశంలో కొత్తగా 179 మెడికల్ కాలేజీలు ఏర్పడగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 558 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.