పోలీసు ముసుగులో ఉన్న ఉగ్రవాది.. దవీందర్ సింగ్పై ఎన్ఐఏ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం..
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన జమ్మూకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్పై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ను కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కేసును ఎన్ఐఏకి అప్పగించేందుకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న దవీందర్ సింగ్ను జమ్మూకశ్మీర్లోని కొంతమంది ఎన్ఐఏ సభ్యులు ఇప్పటికే ప్రాథమికంగా విచారించినట్టు సమాచారం. దవీందర్ సిగ్తో పాటు ఉగ్రవాదులైన నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ నవీద్, అతని అనుచరుడు అతీఫ్ అహ్మద్, న్యాయవాది ఇర్ఫాన్ అహ్మద్లను విచారించినట్టు తెలుస్తోంది.
కాగా, గత వారం ఇద్దరు ఉగ్రవాదులను దవీందర్ తన కారులోనే తరలిస్తూ దవీందర్ సింగ్ పట్టుబడ్డాడు. దవీందర్ డబ్బుల కోసమే ఉగ్రవాదులకు సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూ.12లక్షలకు ఒప్పందం కుదిరినట్టు గుర్తించారు. హిజ్బుల్ ఉగ్రవాది నవీద్ బాబును దవీందర్.. గతేడాది జమ్మూకు తరలించి.. అక్కడ అతని ఆరోగ్యం కుదుటపడ్డాక.. తిరిగి షోపియాన్కు తీసుకొచ్చాడని విచారణలో తేలింది.
25 ఏళ్లుగా కశ్మీర్లో పోలీస్ విధులు నిర్వర్తిస్తున్న దవీందర్ సింగ్పై తొలి నుంచే పలు ఆరోపణలున్నాయి. తొలినాళ్లలో ఓ డ్రగ్స్ లారీని పట్టుకున్న దవీందర్.. అందులోని సరుకును తానే అమ్ముకున్నాడు. విచారణలో నిజం తేలినప్పటికీ.. అప్పట్లో సస్పెన్షన్ వేటుతో సరిపెట్టారు. ఉగ్రవాదులకు సాయం చేస్తూ కశ్మీర్లో పౌరులను హింసిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. 2004లో తీహార్ జైలు నుంచి ఉగ్రవాది అప్జల్ గురు తన లాయర్కు రాసిన లేఖలో దవీందర్ సింగ్ గురించి ప్రస్తావించాడు.
పార్లమెంటుపై దాడికి కొన్ని నెలల ముందు దవీందర్ తనను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినట్టు అఫ్జల్ గురు అందులో తెలిపాడు. తాను ఢిల్లీకి పంపించే ఓ వ్యక్తికి ఎక్కడైనా ఆశ్రయం ఇప్పించాలని ఒత్తిడి చేసినట్టు చెప్పాడు. 2001లో పార్లమెంటుపై దాడి సమయంలో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వ్యక్తే.. దవీందర్ పంపించిన వ్యక్తి అని పేర్కొన్నాడు.కాగా,దవీందర్ సింగ్కు గతంలో రాష్ట్రపతి పోలీసు పతకంతో పాటు పలు అవార్డులు రావడం గమనార్హం. అతనిపై ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు వాటిని రద్దు చేసే అవకాశం ఉంది.