కరోనా రోగులకు కేంద్రం భారీ వెసులుబాటు- ఆస్పత్రుల్లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు..
కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ మానవ సంబంధాలు కూడా దెబ్బతినడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమీక్షించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం చెదరిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
Recommended Video
Coronavirus: సీఎంకు కరోనా, నేడు కూతురికి పాజిటివ్, కొడుకు క్వారంటైన్, బల్లాల్ క్లారిటీ !
కరోనా ఆస్పత్రుల్లో ఇకపై స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోగులు వీటిని నిర్భయంగా వాడుకునేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొంది. స్మార్ట్ పరికరాల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లలో మాట్లాడుకోవడం ద్వారా కుటుంబ సభ్యులతో కరోనా రోగుల సంబంధాలు దెబ్బతినకుండా మానసికంగా వారికి ఊరట లభిస్తుందని కేంద్రం తన ఆదేశాల్లో తెలిపింది. అప్పుడే రోగులు త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది.
ప్రస్తుతం రోగులకు సెల్ ఫోన్ వాడేందుకు కరోనా ఆస్పత్రుల్లో అధికారులు పరిమితంగా అనుమతిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లతో వీడియో కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు మాత్రం ఉండటం లేదు. దీంతో కేంద్రానికి ఈ విషయంపై పలు విజ్ఞప్తులు అందాయి. వీటిని పరిశీలించిన కేంద్రం.. తాజా ఆదేశాలు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు కరోనా రోగులకు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ లో మాట్లాడేందుకు అనుమతించడం లేదని, దీనిపై వారి కుటుంబ సభ్యుల నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల చికిత్సకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ పంపిన తాజా లేఖలో పేర్కొంది.