కావేరీ సమస్య: మోడీ జోక్యం, తమిళనాడుతో కర్ణాటక రాజీ ? ఢిల్లీకి రండి, ఆహ్వానం!
న్యూఢిల్లీ: గత శతాబ్ధాలుగా కావేరీ నది నీరు పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో కర్ణాటక సంతృప్తిగా ఉంది. తమిళనాడు మాత్రం కావేరీ నీటి పంపిణి విషయంలో మాకు అన్యాయం జరిగిందని అసంతృప్తితో ఉంది.
సుప్రీం కోర్టు ఆదేశం
కావేరీ నీటి సమస్యను పలు కోణాల్లో పరిశీలించి సుధీర్ఘంగా విచారణ చేసిన సుప్రీం కోర్టు గత నెల సంచలన తీర్పు చెప్పింది. కావేరీ నదీ నీటి పంపిణి నిర్వహణా మండలి ఆదేశాలకు కొన్ని మార్పులు చేర్పులు చేసిన సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
కర్ణాటక హ్యాపీ
కావేరీ నదీ నీటి పంపిణి నిర్వహణ మండలి ఆదేశాల కంటే తమిళనాడుకు కొన్ని టీఎంసీల తక్కువ నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పును కర్ణాటకలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సహ రైతులు, ప్రజలు స్వాగతించారు.
తమిళనాడు అసహనం
కావేరీ నదీ నీటి పంపిణి విషయంలో మాకు అన్యాయం జరిగిందని, వెంటకే కేంద్ర ప్రభుత్వం కావేరీ నదీ నీటి పంపిణి నిర్వహణా మండలి ఏర్పాటు చెయ్యాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు, రైతులు, విద్యార్థులు, పలు స్వచ్చంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రం క్లారిటీ
కావేరీ నదీ నీటి పంపిణి విషయంలో తమిళనాడు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈనెల 9వ తేదీన ఢిల్లీలో కావేరీ నీటి విషయంపై జరిగే చర్చ సమావేశానికి రావాలని తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రభుత్వాలను సోమవారం కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.