ఎట్టకేలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కేఎం జోసెఫ్కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్ పదోన్నతిపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జస్టిస్ కేఎం జోసఫ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జస్టిస్ జోసఫ్తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్లకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. జస్టిస్ జోసఫ్ పదోన్నతి విషయమై గత కొంతకాలంగా సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
జస్టిస్ జోసఫ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదిస్తూ ఈ ఏడాది జనవరిలో కొలీజియం ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. అయితే ఈ సిఫార్సులను కేంద్రం తిరస్కరించింది.
జస్టిస్ జోసఫ్కు సీనియార్టీ లేదని, ఆయన పదోన్నతి అంశాన్ని మరోసారి పరిశీలించాలని కోరింది. ఆ తర్వాత మళ్లీ పరిశీలన జరిపిన కొలీజియం మే 16న మరోసారి జస్టిస్ జోసఫ్ పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి సిఫార్సులు పంపింది. తాజాగా ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదించింది.
ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో జస్టిస్ జోసఫ్ త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా ఆమోదాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 25కు పెరిగింది. ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.