బీజేపీ ఆఫర్: ఇక్కడ పెట్రోల్ ధరలు రూ.2.50 కాదు, రూ.5 తగ్గింపు!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గురువారం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రం దారిలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు నడిచాయి. మహారాష్ట్ర, గుజరాత్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాలు మరో రూ.2.50 తగ్గించాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం రూ.5 తగ్గింది. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించాల్సిందిగా సూచించారు. కేంద్రం నుంచి సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే గుజరాత్, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, అసోం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు స్పందించాయి.
ఫడ్నవీస్ థ్యాంక్స్
ఈ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న సుంకాన్ని రూ.2.50చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. చమురు ఉత్పత్తులపై కేంద్రం సుంకాన్ని తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి జైట్లీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిచ్చేదని అన్నారు.
గుజరాత్ వాసులపై రూ.5 తగ్గనున్న భారం
అలాగే, జైట్లీ సూచన మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2.50చొప్పున సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. దీని వల్ల మహారాష్ట్ర ప్రజలకు రూ.5 మేర భారం తగ్గనుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న సుంకాన్ని తగ్గిస్తున్నట్లు సీఎం విజయ్ రూపానీ ప్రకటన చేశారు. కేంద్రం చమురు ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించిన దానికి అనుగుణంగా గుజరాత్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2.50చొప్పున సుంకాన్ని తగ్గిస్తుందని రూపానీ ట్విటర్ చేశారు. దీంతో గుజరాత్ వాసులకు రూ.5మేర భారం తగ్గనుంది.
చత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందన
ముంబైలోనే అత్యధికంగా పెట్రోల్ ధర రూ.91ను క్రాస్ చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్పై భారీ ఊరట ఇవ్వడంతో, ముంబై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రకటించారు. దీంతో మొత్తంగా తమ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ రూ.5 తక్కువకు రానుంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో
ఉత్తర ప్రదేశ్లో కూడా రూ.2.50 తగ్గిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటన చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశం, అసోం తదితర రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉంది.