కీలక నిర్ణయం: జమ్ము కాశ్మీర్లో జమాత్ ఏ ఇస్లామిని నిషేధించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కాశ్మీర్లోని జమాత్ ఏ ఇస్లాంను (జేఈఐ) నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటంతో పాటు జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తుందనే ఆరోపణలతో నిషేధించింది.
ఇటీవల జమాత్ ఏ ఇస్లాంకు చెందిన దాదాపు 150 మందిని భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, దేశానికి నష్టం చేసేలా విధ్వంస కార్యకలాపాలలో పాల్గొంటుందని కేంద్రం అభిప్రాయపడింది.
ఇలాంటి సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిన పరిణామాలను కూడా వివరించింది. ప్రజాస్వామ్యం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, తద్వారా భారతదేశంలోని భూభాగాన్ని విడదీసేలా కుట్రలు చేస్తున్నాయని, అందుకే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కాగా, భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతపై ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం గురువారం జరిగింది. లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో పాటు త్రివిధ దళాల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.