Fact check : అక్టోబర్ 15 వరకూ రెస్టారెంట్ల మూసివేత వార్తలపై కేంద్రం క్లారిటీ
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఏ వార్త కనిపించినా దానిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు సైతం నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కొన్ని వార్తలను నిషేధించాలనే ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటివరకూ అది సాధ్యం కావడం లేదు. ఇలాంటి తరుణంలో కేంద్రం కరోనా వైరస్ పేరుతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్లను అక్టోబర్ 15 వరకూ మూసివేయాలని నిర్ణయించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కరోనా వేళ కృష్ణా జిల్లాలో ఆవులకు ఎర్రటి మచ్చలు- కళ్లలో రక్తం- స్ధానికుల్లో ఆందోళన..
రెస్టారెంట్ల మూత- సోషల్ వైరల్..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంచనాలకు మించి ప్రబలుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటి పోయింది. మరికొన్ని చోట్ల మాత్రం పరిస్ధితి అదుపులోనే కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేతపై మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదు. ఇలాంటి సమయంలో కేంద్రం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రెస్టారెంట్లను అక్టోబర్ 15 వరకూ మూసివేయాలని కేంద్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది.
ఖండించిన కేంద్రం.. అలాంటిదేమీ లేదని క్లారిటీ...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అక్టోబర్ 15 వరకూ రెస్టారెంట్లు మూసివేయాలని తాము నిర్ణయించినట్లు సర్క్కలేట్ అవుతున్న వార్త ఫేక్ అని కేంద్ర పర్యాటక శాఖ స్పష్టం చేసింది. తాము అలాంటి లేఖ ఏదీ విడుదల చేయలేదని పర్యాటక శాఖ ఓ ప్రకటన ఇచ్చింది. ఇలాంటి ఫేక్ ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా కోరింది. దీంతో రెస్టారెంట్ల మూతపై జనానికి ఓ క్లారిటీ వచ్చినట్లయింది. లాక్ డౌన్ అమల్లో ఉన్నంతవరకూ మాత్రం రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు తెరవడంపై ప్రస్తుతానికి నిషేధం ఉంది. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఫుడ్ ఆన్ లైన్ డెలివరీపైనా ఆంక్షలు విధించాయి.