ఏం జరుగుతోంది: జమ్మూ నుంచి ఢిల్లీకి అజిత్ దోవల్... కశ్మీర్లో భారీగా బలగాలు మోహరింపు
శ్రీనగర్/ న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10వేల ట్రూపుల పారామిలటరీ బలగలాలను జమ్ముకశ్మీర్కు పంపింది. అయితే దీని వెనక కేంద్రం ఏమైనా ఆలోచన చేసిందా..? అనేదానిపై చర్చ జరుగుతోంది.
జమ్మూ నుంచి ఢిల్లీకి అజిత్ దోవల్ చేరుకోగానే....
జమ్ము కశ్మీర్కు పారామిలటరీ దళాలను పంపాలన్న నిర్ణయం గత రెండు రోజులుగా జమ్ముకశ్మీర్లో ఉన్న జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఢిల్లీకి తిరిగి చేరుకోగానే జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జమ్ముకశ్మీర్లో సీనియర్ ఉన్నతాధికారులతో సమావేశమై శాంతిభద్రతలపై వారితో చర్చించిన తర్వాతే దోవల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఉత్తర కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నందున అక్కడికి బలగాలను పంపాలని తాము ఎప్పుడో విజ్ఞప్తి చేసినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. అంతేకాదు అదనంగా బలగాలను అక్కడ పంపుతున్నట్లు కేంద్రహోంశాఖ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. వీరంతా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రక్షణగా ఉంటారని పేర్కొంది. దేశంలో పలు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బలగాలను ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
ప్రత్యేక విమానాల్లో పారామిలటరీ బలగాల తరలింపు
ఉత్తర కశ్మీర్లో తక్కువ బలగాలు ఉన్నందున అదనంగా 100కంపెనీల బలగాలను ప్రత్యేక విమానంలో తరలిస్తున్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అమర్నాథ్ యాత్ర నుంచి ఈ మధ్యే 40 వేల మందితో కూడిన సైన్యాన్ని కశ్మీర్కు తరలించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 24వ తేదీన 100 కంపెనీలతో కూడిన సెంట్రల్ పారామిలటరీ బలగాలను కశ్మీర్లోయకు తరలించడం జరిగింది. ఏప్రిల్-మే నెలల మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల కోసం వారిని తరలించడం జరిగిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జమాత్-ఈ-ఇస్లామిపై అనే సంస్థపై నిషేధం విధించింది కేంద్రం ప్రభుత్వం. శాంతి భద్రతల దృష్ట్యా పారామిలటరీ బలగాలను అక్కడకు పంపాము తప్పితే ఇందులో మరో అంశం వేరేది ఏదీ దాగిలేదని డీజీపీ వివరణ ఇచ్చారు.
ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్లాన్ చేస్తోందా..?
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో బీజేపీ జమ్మూ కశ్మీర్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆ రాష్ట్రంలో పలుమార్లు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత అక్కడి రాష్ట్రపతి పాలనను మరికొన్ని రోజులు పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే త్వరలో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించి అక్కడ సైతం కాషాయ జెండాను ఎగురవేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.